- నేటి నుంచి హాంకాంగ్ ఓపెన్
- టైటిల్పై సాత్విక్-చిరాగ్ గురి
హాంకాంగ్: ఇండియా షట్లర్లు మరో సవాల్కు రెడీ అయ్యారు. కొంతకాలంగా ఆరంభం రౌండ్లలోనే వెనుదిరిగి నిరాశపరస్తున్న స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు మంగళవారం మొదలయ్యే హాంకాంగ్ ఓపెన్లో అయినా మెరుగ్గా ఆడాలని చూస్తున్నారు. అదే సమయంలో సంచలన విజయాలతో దూసుకెళ్తున్న డబుల్స్ యువ జంట సాత్విక్ సాయిరాజ్-–చిరాగ్ శెట్టి ఫామ్ కొనసాగించాలని భావిస్తోంది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ఇండియా జోడీ.. గత రెండు టోర్నీల్లో అద్భుతంగా ఆడింది. ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన ఈ జంట చైనా ఓపెన్–750 టోర్నీలో సెమీస్ వరకు వచ్చింది. ఈ టోర్నీ తొలి రౌండ్లో జపాన్కు చెందిన టకురొ హొ–కి-యుగో కొబాయషి ద్వయాన్ని ఎదుర్కోనున్న సాత్విక్, చిరాగ్పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఆగస్టులో వరల్డ్ చాంపియన్షిప్ నెగ్గిన సింధు, ఇండోనేసియా మాస్టర్స్ గెలిచిన సైనా ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్స్ రావడం మినహా మిగతా టోర్నీల్లో ఫస్ట్ లేదా సెకండ్ రౌండ్లలోనే ఓడిపోయారు. చైనా ఓపెన్లోనూ మొదటి రౌండ్లోనే పోరు ముగించారు. చైనాలో తనను ఓడించిన కాయ్ యన్ యన్ (చైనా)తోనే ఈ టోర్నీలో సైనా పోరు ఆరంభించనుంది. ఆరో సీడ్ సింధు.. కొరియాకు చెందిన 19వ ర్యాంకర్ కిమ్ గా ఎయున్తో తొలి రౌండ్లో పోటీ పడనుంది. ఇక, చైనా ఓపెన్కు గైర్హాజరైన కిడాంబి శ్రీకాంత్కు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో వరల్డ్ నంబర్ వన్ కెంటో మొమోటా రూపంలో పెను సవాల్ ఎదురవనుంది. స్విస్ ఓపెన్లో ఫైనల్ చేరిన మరో తెలుగు షట్లర్ బి. సాయి ప్రణీత్ కూడా ఆరంభ మ్యాచ్లోనే మూడో సీడ్ షి యు కీ (చైనా) లాంటి కఠిన ప్రత్యర్థిని ఎదుర్కోనున్నాడు. తైవాన్కు చెందిన వాంగ్ జు వెయ్తో సమీర్ వర్మ, చైనా ఆటగాడు హువాంగ్ జియాంగ్తో హెచ్ఎస్ ప్రణయ్ పోటీ పడనుండగా, తెలుగు షట్లర్ పారుపల్లి కశ్యప్.. జపాన్కు చెందిన కెంటా నిషిమొటోతో పోరు ఆరంభించనున్నాడు. డబుల్స్లో-అశ్విని, ప్రణవ్, సిక్కిరెడ్డి కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.