
- 70 కోట్ల బీసీలకు దక్కిన గౌరవం
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
ముషీరాబాద్,వెలుగు : బిహార్ మాజీ సీఎం బీసీల అభివృద్ధికి బాటలు వేసిన కర్పూరి ఠాకూర్కు కేంద్రం భారతరత్నను ప్రకటించడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బడుగుల కోసం తన జీవితాంతం చేసిన నిర్విరామ పోరాటానికి గుర్తింపుగా భారతరత్నతో గౌరవించడమటే దేశంలోని 70 కోట్ల బీసీలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నామన్నారు.
కర్పూర్ ఠాగూర్ శత జయంతి సందర్భంగా బుధవారం దోమలగూడలోని బీసీ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కర్పూరి ఠాకూర్ పేరిట రూ. 100 స్మారక నాణేలు విడుదల చేయాలని నిర్ణయించడం స్వాగతిస్తున్నామన్నారు.
శతజయంతి కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యాం, నేతలు బడే సాబ్, జాజుల లింగం శ్యామల పాల్గొన్నారు.
ఓయూలో..
బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ జయంతిని ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఘనంగా నిర్వహించారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొఫెసర్ బాగయ్య, కాసీం పాల్గొని కర్పూరి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.