నల్గొండలో ఆస్పత్రి సీజ్

నల్గొండలో ఆస్పత్రి సీజ్

పర్మి షన్ లేకుండా కరోనా ట్రీట్​మెంట్ చేస్తున్నారని..

డ్యూటీలో ఉన్న డాక్టర్, స్టాఫ్ అరెస్టు

అడ్డుకున్న రోగుల అటెండెంట్లు

ట్రీట్ మెంట్ చేసే డాక్టర్లను ఎట్ల తీసుకెళ్తారని నిలదీత

సర్దిచెప్పిన పోలీసులు.. రిమాండ్​కు డాక్టర్, స్టాఫ్

అరెస్టులు అన్యాయం: చెరకు సుధాకర్

నల్గొండ, నల్గొండ అర్బన్‍, వెలుగు: పర్మిషన్ లేకుండా కరోనా పేషెంట్లకు ట్రీట్​మెంట్ చేస్తున్నారంటూ నల్గొండలోని నవ్య హాస్పిటల్​ను ఆఫీసర్లు, పోలీసులు సీజ్ చేశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్, ఫార్మా సిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ తదితరులను అరెస్ట్ చేశారు. వారిని తీసుకెళ్తుండగా పేషెంట్ల అటెండెంట్లు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని వారించి డాక్టర్, స్టాఫ్ ను స్టేషన్​కు పట్టుకెళ్లారు.

టెస్టులు చేయకుండానే ట్రీట్ మెంట్.. అందుకే సీజ్ : ఎస్పీ రంగనాథ్

జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొండల్ రావు, నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రిలో రోగులకు కరోనా పరీక్షలు నిర్వహించకుండానే ట్రీట్మెంట్ పేరిట బిల్లులు వసూలు చేస్తున్నట్లు తమ విచారణలో తేలినందని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. అందుకే నిర్వాహకులను అరెస్ట్ చేసి, ఆసుపత్రిని సీజ్ చేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో డాక్టర్, స్టాఫ్ ను తీసుకెళ్తున్న పోలీసులను కొందరు రోగుల అటెండెంట్లు అడ్డుకున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ను ఎలా పట్టుకెళ్తారని, తమ వాళ్లకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ నిలదీశారు. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పారు. డాక్టర్,స్టాఫ్ ను స్టేషన్​కు తీసుకెళ్లారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

రాజకీయ కుట్ర: ప్రజా సంఘాలు

ఆస్పత్రిలోకి పోలీసులు వచ్చి డాక్టర్ ను, సిబ్బందిని అరెస్టు చేసి తీసుకెళ్లడం అన్యాయమని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‍ ఆరోపించారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. ఆదివారం నవ్య ఆస్పత్రి ఆవరణలో ప్రజా సంఘాలు, పలు పార్టీల ఆధ్వర్యంలో మీడియాతో సుధాకర్ మాట్లాడారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే రోగులు నుంచి ఫిర్యాదులు వస్తే వైద్యశాఖ నోటీసులు ఇచ్చి తర్వాత చర్యలు తీసుకోవాలన్నారు. కానీ టీఆర్ఎస్ నాయకులు కావాలనే తన కొడుకు డాక్టర్ చెరుకు సుహాస్ ను అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. హైదరాబాద్ లో డబ్బులు కడితేనే డెడ్ బాడీలను ఇచ్చే కార్పొరేట్ ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. పేదలకు ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆస్పత్రి సీజ్‍పై కోర్టుకు వెళ్తానని సుధాకర్ చెప్పా రు. రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో చెరుకు సుధాకర్‍ పోటీ చేయకుండా చూసేందుకే అధికార పార్టీ నేతలు పోలీసులతో కలిసి మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాల సభ్యులు ఆరోపించారు.