న్యూఢిల్లీ: హాస్టళ్లలో ఉంటున్న వారు.. ఈ వార్త వింటే మీ గుండె బరువెక్కుతుంది. నిజమేనండీ.. హాస్టళ్లలో ఉంటున్న వారికి 12 శాతం జీఎస్టీ వర్తిస్తుందని రెండు తీర్పులు స్పష్టం చేశాయి. దీంతో హాస్టళ్లలో ఉండే వారికి అద్దె భారం మరింత పెరగనుంది. అందులో ఉంటున్న వారిపై ట్యాక్స్ భారం పెరగనుంది. వీరు చెల్లించే రెంట్పై 12 శాతం జీఎస్టీని వేయనున్నారు. హాస్టల్స్ను రెసిడెన్షియల్ ఇండ్లుగా చూడలేమని, అందువలన వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేమని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) బెంగళూరు బెంచ్ తీర్పిచ్చింది.
శ్రీసాయి లగ్జరీయస్ స్టే ఎల్ఎల్పీ కేసులో తీర్పిచ్చిన ఏఏఆర్, రోజుకి రూ.1,000 వరకు ఛార్జ్ చేసే హోటల్స్, క్లబ్లు, క్యాంప్సైట్లకు జులై 17,2022 వరకు మాత్రమే జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని పేర్కొంది. పర్మినెంట్గా నివసించేందుకు రెసిడెన్షియల్ యూనిట్లను పరిగణిస్తారని, వీటిలో గెస్ట్ హౌస్లు, లాడ్జ్లు వంటివి ఉండవని పేర్కొంది. పీజీ లేదా హాస్టల్ సర్వీస్లు గెస్ట్ హౌస్ లేదా లాడ్జింగ్ సర్వీస్లకు పోలి ఉంటాయని, అందువలన వీటిని రెసిడెన్షియల్ ఇండ్లుగా చూడలేమని పేర్కొంది.
నొయిడాకు చెందిన వీఎస్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్టల్ ప్రైవేట్ లిమిటెడ్ మేటర్లోనూ ఏఆర్ లఖ్నవూ బెంచ్ సైతం ఇదే తీర్పును వెలువరించింది. హాస్టల్ వసతికి రోజుకు రూ.1000 తక్కువ ఉన్నా జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొంది. విద్యార్థులు ఎక్కువగా నివాసం ఉండే హాస్టళ్లు, డార్మిటరీలపై 12 శాతం జీఎస్టీ విధించడం అదనపు భారం పడుతుందని ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ పునరాలోచించాలని కోరారు. ఈ బెంచ్లు ఇచ్చిన తీర్పులను అన్ని రాష్ట్రాలు అమలుచేస్తే హాస్టల్ వసతి మరింత భారం కానుంది.