
కూకట్పల్లి, వెలుగు: హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ తమ ఇంటి ముందు వాహనాలు పార్క్ చేస్తుండడంతో అభ్యంతరం తెలిపిన ఓ కుటుంబంపై వారంతా కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కేపీహెచ్బీ కాలనీ ఐదో రోడ్డులో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ కాలనీలో ఆంజనేయ బాయ్స్ హాస్టల్ ఉంది. హాస్టల్ ఎదురుగా పవన్నరసింహనాయుడు(33) కుటుంబం నివసిస్తోంది. హాస్టల్లో ఉంటున్న వారు నిత్యం వీరి ఇంటి గేటు ముందు బైక్లు పార్క్ చేస్తున్నారు.
మంగళవారం రాత్రి ఇలాగే బైక్స్ పార్క్ చేయడంతో వాటిని తీసేయాలని ఆ కుటుంబ సభ్యులు కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన హాస్టల్లో నివసిస్తున్న సుమారు 30 మంది పవన్నరసింహనాయుడుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.