జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి
  • మంత్రి హరీశ్ కు డీజేహెచ్‌‌ఎస్‌‌ ప్రతినిధుల విజ్ఞప్తి

హైదరాబాద్‌‌, వెలుగు : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి హరీశ్  రావుకు డెక్కన్  జర్నలిస్ట్స్  హౌసింగ్  సొసైటీ (డీజేహెచ్ఎస్) ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సొసైటీ అధ్యక్షుడు బొల్లోజు రవి ఆధ్వర్యంలో ప్రతినిధులు మంత్రి హరీశ్‌‌ ను బుధవారం కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. హైదరాబాద్‌‌  కేంద్రంగా ఏండ్ల తరబడి పనిచేస్తున్న హైదరాబాద్‌‌  సిటీ, రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. 

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌‌  కేంద్రంగా పనిచేస్తూ అక్రెడిటేషన్‌‌  కలిగిన హైదరాబాద్‌‌  జిల్లా, రాష్ట్ర స్థాయి జర్నలిస్టులు సభ్యులుగా డెక్కన్‌‌  జర్నలిస్ట్‌‌  హౌసింగ్‌‌  సొసైటీ ఏర్పాటైందని పేర్కొన్నారు. సొంత ఇండ్లు లేక, కిరాయిలు చెల్లించలేక జర్నలిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, జర్నలిస్టుల సమస్యలను సీఎం కేసీఆర్‌‌  దృష్టికి తీసుకెళ్తానని హరీశ్‌‌  రావు హామీ ఇచ్చారని సొసైటీ ప్రతినిధులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సొసైటీ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌  శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు రామకృష్ణ, ప్రతాప్‌‌ రెడ్డి 
తదితరులు ఉన్నారు.