డెన్మార్క్ షిప్​పై దాడి.. ఎర్ర సముద్రంలో హౌతీల మిసైల్ అటాక్స్

డెన్మార్క్ షిప్​పై దాడి.. ఎర్ర సముద్రంలో హౌతీల మిసైల్ అటాక్స్
  •     రెండు క్షిపణులను కూల్చేసిన అమెరికా
  •     పడవలపై వచ్చి అదే షిప్​పై హౌతీ మిలిటెంట్ల ఫైరింగ్
  •     డెన్మార్క్, అమెరికా ఎదురు కాల్పులు
  •     పలువురు హౌతీ మిలిటెంట్లు మృతి

బీరూట్ (లెబనాన్): ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ షిప్ పైకి యెమెన్ హౌతీ మిలిటెంట్లు ఆదివారం రెండు యాంటీషిప్ బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించారు. అప్రమత్తమైన అమెరికన్ మిలటరీ దళాలు వాటిని కూల్చేశాయి. నాలుగు గంటల తర్వాత 4 చిన్నపాటి బోట్లపై వచ్చిన హౌతీ మిలిటెంట్లు.. మళ్లీ అదే కంటైనర్ షిప్​పై దాడికి ప్రయత్నించాయని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. దీంతో తాము జరిపిన ఎదురుకాల్పుల్లో పలువురు హౌతీ మిలిటెంట్లు చనిపోయారని వివరించింది. కంటైనర్ షిప్​లోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది. నవంబర్ 19 నుంచి ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలపై హౌతీ మిలిటెంట్లు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. మొత్తం 23 ఇల్లీగల్ దాడులకు పాల్పడినట్టు వివరించింది.

ఒకే షిప్​పై రెండు సార్లు అటాక్​

సింగపూర్ జెండాతో ఉన్న ‘ది మెర్స్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఝూ’ అనే ఇదే కంటైనర్ షిప్​పై దక్షిణ ఎర్ర సముద్రంలో శనివారం రాత్రి కూడా హౌతీ మిలిటెంట్లు మిసైల్ తో దాడి చేశారు. డెన్మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఈ షిప్.. సింగపూర్ నుంచి ఈజిప్టులోని పోర్టు సయీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్తున్నది. నౌకలపై తరుచూ జరుగుతున్న మిసైల్, డ్రోన్ దాడుల నేపథ్యంలో డెన్మార్క్ రెండు రోజుల కిందే.. ఎర్ర సముద్రంలోని అంతర్జాతీయ కూటమిలో చేరింది. ఈ కూటమికి అమెరికా నేతృత్వం వహిస్తున్నది. ఎర్ర సముద్రంలో హౌతీ మిలిటెంట్లు జరుపుతున్న దాడులు తిప్పి కొట్టేందుకు ఏర్పాటైన ఈ కూటమి.. ‘ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాస్పెరిటీ గార్డియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చేపట్టింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం హౌతీ మిలిటెంట్లు డెన్మార్క్ కంటైనర్ షిప్​పై దాడికి ప్రయత్నించారు. అలర్ట్ అయిన సిబ్బంది అమెరికాను సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించిన అమెరికా తన యాంటీ మిసైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో  డెన్మార్క్ షిప్పులపైకి దూసుకొస్తున్న మిసైళ్లను కూల్చివేసింది.

హౌతీ భూభాగం నుంచే..

రెండు మిసైళ్లు యెమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హౌతీ ఆధీనంలో ఉన్న భూభాగంలో నుంచి గాల్లోకి ఎగిరినట్లు అమెరికా, డెన్మార్క్ గుర్తించింది. మిసైళ్లు కూల్చేసిన నాలుగు గంటల తర్వాత నాలుగు ఇరానియన్ బోట్లలో వచ్చిన హౌతీ మిలిటెంట్లు.. కంటైనర్ షిప్​ను చుట్టుముట్టారు. 20 మీటర్ల దూరం నుంచి నౌకపై కాల్పులు జరిపారు. దీంతో షిప్​లోని బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. విషయం తెలుసుకున్న వెంటనే అమెరికాకు చెందిన యూఎస్​ఎస్ డ్వైట్ డి, ఐసెన్​హోవర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, గ్రేవ్​లీ నుంచి అమెరికా హెలికాప్టర్లు ఘటనా స్థలానికి చేరుకుని హౌతీ మిలిటెంట్ల బోట్లపై కాల్పులు జరిపాయి. మూడు బోట్లు మునిగిపోగా, ఒక బోటు అక్కడి నుంచి పారిపోయిందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. డెన్మార్క్, అమెరికా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని, హౌతీ మిలిటెంట్లు చనిపోయారని ప్రకటించింది.

అప్రమత్తమైన ఇండియన్ నేవీ

అరేబియా సముద్రంలో కమర్షియల్ షిప్​లపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ నేవీ అప్రమత్తమైంది. షిప్​లపై నిఘా పరికరాలతో పాటు క్షిపణి దాడులు తిప్పికొట్టేలా ఏర్పాట్లు చేసుకుంది. డిసెంబర్ 23న లైబీరియన్ జెండా ఉన్న ఎంవీ కెమ్ ఫ్లూటో కార్గో షిప్​పై హౌతీ మిలిటెంట్లు డ్రోన్​తో దాడి చేశారు. ఆ షిప్​లో 21 మంది ఇండియన్ నేవీ సిబ్బంది ఉన్నారు. అదే రోజు, కమర్షియల్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్​పై డ్రోన్ దాడి జరిగింది. కొన్ని వారాలుగా ఎర్ర సముద్రంలో జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో ఏడెన్ గల్ఫ్, సెంట్రల్/నార్త్ అరేబియా సముద్రంలో ఇంటర్నేషనల్ షిప్పింగ్ లేన్​ల ద్వారా వెళ్లే కమర్షియల్ షిప్​లపై భద్రత కట్టుదిట్టం చేశామని ఇండియన్ నేవీ తెలిపింది. 

ఇండియా తీరానికి దాదాపు 700 నాటికల్ మైళ్ల దూరంలో ఎంవీ రుయెన్ కమర్షియల్ షిప్​పై కూడా దాడి జరిగిందని వివరించింది. ఇండియా తీరానికి దగ్గర నుంచి వెళ్తున్న షిప్​లపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైనట్టు తెలిపింది. ఇండియన్ ఎక్స్​క్లూజివ్ ఎకనామిక్ జోన్​కు దగ్గర్లో కూడా భద్రత కట్టుదిట్టం చేసినట్లు ఇండియన్ నేవీ ప్రకటించింది. లాంగ్ రేంజ్ పెట్రోల్ ఎయిర్​క్రాఫ్ట్​లను రంగంలోకి దించినట్టు తెలిపింది.