
లండన్: మూడో టెస్ట్లో ఓడి నిరాశలో కూరుకుపోయిన టీమిండియా ప్లేయర్లు.. మంగళవారం బ్రిటన్ కింగ్ చార్లెస్–3ని కలుసుకున్నారు. క్లారెన్స్ హౌస్ గార్డెన్స్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మెన్స్, విమెన్స్ టీమ్లు పాల్గొన్నాయి. ప్లేయర్లతో చాలాసేపు గడిపిన చార్లెస్ క్రికెట్ గురించే ఎక్కువగా ముచ్చటించారు. చివరి వికెట్గా సిరాజ్ ఔటైన తర్వాత ఎలా ఫీలయ్యారు? అని కెప్టెన్ శుభ్మన్ గిల్ను అడిగారు. ‘చార్లెస్తో అద్భుతమైన సంభాషణలు జరిగాయి. కింగ్ చాలా దయ, ఉదార స్వభావం కలవారని నేను భావిస్తున్నా. మా చివరి బ్యాటర్ ఔటైన విధానం చాలా దురదృష్టకరమని, బంతి స్టంప్స్పైకి దొర్లిందని అతను మాకు చెప్పాడు. ఆ తర్వాత మీరు ఎలా ఫీలయ్యారని అడిగారు. ఇది మాకు దురదృష్టకర మ్యాచ్ అని నేను చెప్పా. చివరి రెండు మ్యాచ్ల్లో మాకు అదృష్టం కలిసొస్తుందని నేను ఆశిస్తున్నా’ అని గిల్ పేర్కొన్నాడు. యూకేలో ఆడిన ప్రతీసారి తమకు మంచి ఆతిథ్యం లభిస్తుందన్నాడు. ‘మేం ఎక్కడికి వెళ్లినా మంచి మద్దతు లభించడం చాలా అదృష్టం. యూకేలో కూడా అలాగే జరిగింది. తొలి రెండు రోజులు లార్డ్స్లో ఎక్కువ మంది ఇంగ్లండ్ మద్దతుదారులు ఉన్నారని నేను భావించినా.. చివరి మూడు రోజులు మాకు ఎక్కువగా మద్దతు లభించింది.
తొలి మూడు టెస్ట్లు క్రికెట్ నాణ్యతను పెంచాయని నేను భావిస్తున్నా. ఇరుజట్లు ఆడిన విధానం, వారు చూపిన ఉత్సాహం ఎప్పటికీ మరవలేనిది. మేం చాలా గర్వంగా ఆడామనే అనుకుంటున్నాం. గ్రౌండ్లో శారీరకంగా, మానసికంగా ఇవ్వాల్సిన ప్రతిదీ ఇచ్చాం. ఐదు రోజులు ఆడి కేవలం 22 రన్స్ తేడాతో ఓడామంటే ఆ మ్యాచ్లో క్రికెట్ గెలిచినట్లు’ అని గిల్ వ్యాఖ్యానించాడు. కింగ్ను కలవడం తమకు చాలా ఉత్సాహాన్నిచ్చిందని విమెన్స్ టీమ్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వెల్లడించింది. ‘ఇదో గొప్ప అనుభవం. మేం చాలాసార్లు ఇంగ్లండ్కు వచ్చాం.
కానీ కింగ్ను కలవడం ఇదే మొదటిసారి. అతను చాలా స్నేహపూర్వకంగా ఉన్నాడు. ఇక్కడ మా ప్రయాణం ఎలా ఉందని అడిగాడు’ అని కౌర్ తెలిపింది. ఇక. రాయల్ హౌస్కు వచ్చి రాజును కలవడం చాలా వినయపూర్వకమైన అనుభవమని విమెన్స్ టీమ్ హెడ్ కోచ్ అమోల్ మజుందార్ అన్నాడు. సౌత్ ఆసియాలో పేదరికం, అసమానత, అన్యాయాన్ని పరిష్కరించడానికి కింగ్ చార్లెస్ ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్ ఈ ప్రత్యేక ఈవెంట్ను ఏర్పాటు చేసింది. 2007లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ద్వారా ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. యూకేలోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి, డిప్యూటీ హైకమిషనర్ సుజిత్ ఘోష్తో పాటు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నెల 23 నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే నాలుగో టెస్ట్ కోసం ఇండియా టీమ్ మాంచెస్టర్కు బయలుదేరింది. ఇంగ్లండ్తో వన్డే మ్యాచ్ కోసం విమెన్స్ టీమ్ సౌతాంప్టన్కు తిరిగి వచ్చింది.