
- అధిక వడ్డీలు, యాన్యువల్ ఫీజులు, లేట్ ఫీజుల నుంచి రెవెన్యూ
- కంపెనీలకు నిలకడైన ఆదాయం
- బ్యాంకులు కస్టమర్లను పెంచుకునే వీలు
- రివార్డులు, క్యాష్ బ్యాక్లతో పెరుగుతున్న వినియోగం
న్యూఢిల్లీ: ఇండియాలో క్రెడిట్ కార్డుల ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. బిల్ చెల్లించడానికి సుమారు 45 రోజుల టైమ్ ఉంటుంది. దీంతో చాలా మంది క్రెడిట్ కార్డులను వాడడానికి మొగ్గు చూపుతున్నారు. కార్డుతో చేసే కొన్ని ఖర్చులపై క్యాష్బ్యాక్, రివార్డ్స్ కూడా పొందొచ్చు. క్రెడిట్ కార్డు కంపెనీలు లేదా బ్యాంకులు లాభాలు ఎలా పొందుతాయి?
అని సందేహం ఉండొచ్చు. దీని గురించి తెలుసుకుందాం.
11 కోట్ల క్రెడిట్ కార్డులు..
ఆర్బీఐ డేటా ప్రకారం, ఈ ఏడాది జనవరి నాటికి ఇండియాలో 11 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులు ఇష్యూ అయ్యాయి. వడ్డీ రేట్లు, వ్యాపారుల నుంచి వచ్చే ఛార్జీలు ద్వారా కంపెనీలు లేదా బ్యాంకులు లాభం పొందుతాయి. దీంతో ఇవి పెద్ద మొత్తంలో కార్డులను ఇష్యూ చేస్తున్నాయి. క్రెడిట్ కార్డులతో వీటికి నిలకడగా ఆదాయం వస్తుంది. అంతేకాకుండా కస్టమర్లను పెంచుకోవడానికి, కన్జూమర్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వీలుంటోంది. ఈ ఏడాది జనవరిలో ఇండియాలో క్రెడిట్ కార్డుల ద్వారా వినియోగం ఏడాది లెక్కన 10.8 శాతం పెరిగి రూ.1.84 లక్ష కోట్లకు చేరింది.
ఆదాయం ఇలా..
క్రెడిట్ కార్డ్ కంపెనీలు వివిధ మార్గాల్లో డబ్బు సంపాదిస్తాయి.
1) అధిక వడ్డీలు: క్రెడిట్ కార్డు యూజర్ బిల్లును ఆలస్యంగా చెల్లిస్తే అధిక వడ్డీలను కంపెనీలు వసూలు చేస్తాయి. అంతేకాకుండా లేట్ ఫీజు కూడా వేస్తాయి.
2) ఇతర ఫీజులు: యాన్యువల్ ఫీ, కార్డ్ రీ-ఇష్యూ ఫీ, ఇంటర్చేంజ్ ఫీజు (మర్చంట్ ప్రతి ట్రాన్సాక్షన్పై బ్యాంక్కు చెల్లించే అమౌంట్) వంటివి వసూలు చేస్తాయి.
ఫిన్టెక్లతో కలిసి కార్డులు..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి పెద్ద బ్యాంకులు క్రెడిట్ కార్డులను భారీగా ఇష్యూ చేస్తున్నాయి. వీటి క్రెడిట్ కార్డు పోర్టుఫోలియో విస్తరిస్తోంది. డిజిటల్ పేమెంట్స్, ఫిన్టెక్ టెక్నాలజీలు కూడా ఈ ఇండస్ట్రీని మార్చేస్తున్నాయి. బ్యాంకులు కస్టమర్ ఎక్స్పీరియన్స్, మెరుగైన సెక్యూరిటీని అందించడానికి టెక్నాలజీలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దీంతో క్రెడిట్ కార్డుల వాడకం మరింతగా పెరుగుతుందని అంచనా. బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలతో కలిసి క్రెడిట్ కార్డు బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నాయి కూడా. కస్టమర్లకు మరిన్ని సర్వీస్లను అందిస్తున్నాయి.
యూజర్లను ఎలా ఆకర్షిస్తాయంటే?
క్రెడిట్ కార్డు కంపెనీలు లేదా బ్యాంకులు యూజర్లను ఆకర్షించేందుకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. క్యాష్బ్యాక్, లాయల్టీ పాయింట్స్, ట్రావెల్ డిస్కౌంట్స్ వంటివి ఆఫర్ చేస్తాయి. ఎప్పటికప్పుడు బిల్లు చెల్లిస్తే యూజర్ క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. భవిష్యత్లో తక్కువ వడ్డీకే లోన్లను తీసుకోవడానికి వీలుంటుంది. క్యాష్బ్యాక్, రివార్డ్ పాయింట్స్ లాంటి స్కీమ్స్ కస్టమర్స్ను మళ్లీ మళ్లీ ఖర్చు చేసేలా ప్రోత్సహిస్తాయి. కానీ, క్రెడిట్ కార్డ్ను తప్పుగా వాడుతున్న కేసులు ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి.
అందుకే బ్యాంక్ రూల్స్ను ఆర్బీఐ కఠినం చేసింది. అయినప్పటికీ సమస్యలు లేకపోలేదు. క్రెడిట్ కార్డ్ మోసాలు ఎక్కువవుతున్నాయి. దీంతో క్రెడిట్ కార్డు వంటి అన్సెక్యూర్డ్ లోన్స్ రిస్క్ తగ్గించడానికి తాజాగా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకటించింది. బ్యాంకులు కన్జూమర్ లోన్స్ తగ్గించాలని, డిపాజిట్లను మరింతగా ఆకర్షించాలని సూచించింది.