
బషీర్బాగ్,వెలుగు: ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. తెలంగాణ మోడల్ స్కూల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మంగళవారం లక్డికాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు.
ఆర్. కృష్ణయ్య మద్దతు తెలిపి మాట్లాడారు. నెలకు రూ.15 వేల జీతంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్తెసరు జీతం కూడా ఆరు నెలలుగా పెండింగ్లో ఉంటే వారు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయకులు వేముల రామకృష్ణ , నందగోపాల్, వెంకటేశ్ పాల్గొన్నారు.