మిర్చికి బ్రాండ్ అంబాసిడర్ గా ఇండియా

మిర్చికి బ్రాండ్ అంబాసిడర్ గా ఇండియా

భారతదేశం విభిన్న సంస్కృతులు, వంటకాలు, సుగంధ ద్రవ్యాలు లాంటి బహుముఖ సంపదతో విలసిల్లుతూ ఉంది. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్న గుంటూరు ఘాటు మిరపకాయలకు గమ్యస్థానంగా నిలుస్తోంది. భారతదేశం చిల్లీ సిటీగా ఈ జిల్లా ఇప్పటికే ఓ అరుదైన బిరుదును సంపాదించింది. ఈ ప్రదేశం మిరపకాయల ఉత్పత్తికి, ఎగుమతికి ప్రపంచ కేంద్రంగా ఖ్యాతిని సొంతం చేసుకుంది.

గుంటూరుకు విశేషమైన ప్రత్యేకత ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మిరప రకాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో మసాలా ఔత్సాహికుల హృదయాలను దోచుకునే "వండర్ హాట్" అనేటువంటి మిరప శ్రేణులతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వీటిలో ముఖ్యంగా గుంటూరు సన్నం-S4, 334 మిరపకాయలు వంటివి ఇక్కడ ఉత్పత్తయ్యే ప్రసిద్ధ రకాలు. రుచితో పాటు ఘాటుగా ఉండే వీటిని విదేశీ మార్కెట్‌లకు కూడా తరలిస్తారు. ఈ నగరం ఫట్కి, ఇండో-5, అంకుర్, రోష్ని, బెడ్కి, బైడ్గి, 273, ముడతలు, తేజ, సూపర్ హాట్, మధుబాల వంటి మిరప రకాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది.

మిర్చి వ్యాపారంలో గుంటూరుకు ఉన్న ప్రాధాన్యత ప్రపంచ మిర్చి ఉత్పత్తి, ఎగుమతిలో భారతదేశాన్ని ముందంజలో ఉంచుతోంది. భారతదేశం మొత్తం మిర్చి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే 40% వాటాను కలిగి ఉంది. గుంటూరు నగరం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 640 మిలియన్ డాలర్ల విలువైన మిర్చి ఎగుమతులను సాధించి ఇటీవల రికార్డు కూడా సృష్టించింది. ఇండియాలో 2020-21 కాలంలో మొత్తం మిరప ఎగుమతులు విశేషంగా 1.1 బిలియన్ డాలర్లకు చేరుకుని అత్యంత అరుదైన ఘనతను దక్కించుకుంది. గత రెండు సంవత్సరాలుగా మిరప ఎగుమతుల్లో 25% వృద్ధిని కనబరుస్తుండగా.. 610 వేల టన్నుల వరకు అంతర్జాతీయ మార్కెట్లకు తరలివెళ్తుండడం గమనార్హం,

మిరప ఉత్పత్తిలో గుంటూరు అగ్రస్థానంలో ఉండగా, ప్రపంచంలోనే అతిపెద్ద మిరప ఉత్పత్తి, ఎగుమతిదారుగా భారతదేశ వారసత్వాన్ని నిలబెట్టడంలో మరో రెండు జిల్లాలు కూడా ఉన్నాయి. అవి కర్ణాటకలోని హవేరి, మిజోరంలోని సియాహా లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.