బొజ్జ గణపయ్యకు నైవేద్యాలు.. ఎలా తయారుచేయాలంటే..

బొజ్జ గణపయ్యకు నైవేద్యాలు.. ఎలా తయారుచేయాలంటే..

వినాయకుడికి కుడుములు, ఉండ్రాళ్లు అంటే బోలెడంత ఇష్టం.  భోజనప్రియుడైన గణపయ్యకు రకరకాల  నైవేద్యాలు సమర్పిస్తారు. వాటినెలా తయారుచేయాలంటే..

పాల ఉండ్రాళ్లు

కావాల్సినవి :  బియ్యప్పిండి: 80 గ్రాములు; నీళ్లు: పావులీటర్‌‌; నెయ్యి/ వెన్న: ఒక టేబుల్‌ స్పూన్; 
ఉప్పు: చిటికెడు; పాలు: అర లీటర్‌‌; చక్కెర: 120 గ్రాములు; కొబ్బరి తురుము: పావు కప్పు; యాలకుల పొడి: అర టీ స్పూన్

తయారీ : బియ్యప్పిండి జల్లెడ పట్టాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, గోరు వెచ్చగా కాగబెట్టాలి. నీళ్లలో చిటికెడు ఉప్పు, ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి/వెన్న, బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా ముద్దలా చేయాలి. పిండి చల్లారాక చిన్న చిన్న ఉండలు చేయాలి. మరో వెడల్పాటి గిన్నెలో పాలు మరగబెట్టాలి. ఆ పాలలో కొబ్బరి, యాలకుల పొడి, చక్కెర వేసి అది కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఉండ్రాళ్లను కాగుతున్న పాలలో వేసి ఐదు నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి. స్టవ్‌ ఆపేసి, పది నిమిషాలు గిన్నె కదిలించకుండా ఉంచితే ఉండ్రాళ్లు విరిగిపోవు.

ALSO READ : బీఆర్ఎస్​లో అసంతృప్తులు ఒక్కటైతున్నరు

పూర్ణం కుడుములు

కావాల్సినవి:   శెనగపప్పు: ముప్పావు కప్పు,  బెల్లం- తురుము: ఒక కప్పు,  ఎండు కొబ్బరి తురుము:- అర కప్పు,  బియ్యప్పిండి:- ఒకటిన్నర కప్పు, ఇలాచీ పొడి:- ఒక టేబుల్‌‌ స్పూన్‌‌,  ఉప్పు: చిటికెడు, నెయ్యి: సరిపడా

తయారీ:   శెనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్‌‌లో ఒక విజిల్‌‌ వచ్చేవరకు ఉడికించాలి. కొద్దిసేపయ్యాక పప్పులో ఉన్న నీటిని పారబోసి పక్కనపెట్టాలి. స్టవ్​పై ఒక గిన్నె పెట్టి, అందులో బెల్లం తురుము, సరిపడా నీళ్లు పోసి పాకం పట్టాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన శెనగపప్పు, ఎండుకొబ్బరి తురుము, ఇలాచీ పొడి వేసి పది నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం గట్టి పడ్డాక స్టవ్​ ఆపేయాలి. అది చల్లారిన తర్వాత ఉండలుగా చేసి ఒక ప్లేట్‌‌లో వేయాలి. 

తర్వాత మరో గిన్నెలో  కొద్దిగా నెయ్యి, ఉప్పు, బియ్యప్పిండి, సరిపడా గోరువెచ్చని నీళ్లు పోసి కలపాలి. చేతికి నూనె రాసుకుని బియ్యప్పిండి మిశ్రమాన్ని పల్చటి బిళ్లలుగా వత్తి, మధ్యలో శెనగపప్పు ఉండల్ని పెట్టి గుండ్రంగా చేయాలి. నూనె లేదా నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లలో ఈ కుడుములను పెట్టి పదిహేను నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి.