శబరిమలకు పోటెత్తిన భక్తులు.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శబరిమలకు పోటెత్తిన భక్తులు.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగిపోతోంది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవటానికి వస్తున్న భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఓ వైపు వర్షాలు, చలి పెడుతున్నా.. అయ్యప్ప భక్తులు మాత్రం స్వామిని దర్శనం చేసుకోవటానికి వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం కేరళలో భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. 

శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, యూపీ నుంచి లక్షలాది మంది అయ్యప్ప దీక్షాపరులు, భక్తులు శబరిగిరులకు చేరుకుంటున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతున్నది. ఎరుమేలికి నాలుగు కిలోమీటర్లకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. తెల్లవారు జామున 4 గంటల నుంచి భక్తులు ఇబ్బందులుపడుతున్నారు. పలువురు భక్తులు ఎరుమేలి నుంచి శబరిమలకు పాదయాత్రగా పయనమవుతున్నారు. అదే సమయంలో స్వామివారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతున్నది. ఈక్రమంలో పలువురు భక్తులు స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు. 

స్వామివారి మాలధారణలో చిన్నారులు సైతం ఉండగా.. తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరో వైపు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో శబరిమల ఆలయానికి సంప్రదాయ అటవీ మార్గంలో వెళ్లేందుకు ప్రభుత్వం సమయాన్ని పొడిగించింది.