- రెండో స్థానంలో హెచ్సీఎల్
- హైదరాబాద్ నుంచి డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, వెలుగు: పర్యావరణాన్ని కాపాడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న కంపెనీల వివరాలతో పర్పిచ్యువల్ క్యాపిటల్, హురున్ ఇండియా ‘ఇంపాక్ట్50 2026’ పేరుతో హైదరాబాద్లో రిపోర్టును విడుదల చేశాయి. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో (ఎస్జీడీలు) భారత కంపెనీల పనితీరును ఇందులో గుర్తించారు. హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) ఈ జాబితాలో మొదటిస్థానంలో నిలవగా హెచ్సీఎల్ టెక్నాలజీస్ రెండో స్థానం దక్కించుకుంది.
ముంబై నుంచి అత్యధికంగా 26 కంపెనీలు ఇందులో చోటు సంపాదించాయి. మెటల్స్, మైనింగ్ రంగం నుంచి ఏడు కంపెనీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. హెచ్యూఎల్ 97 శాతం క్లీన్ ఎనర్జీతో నడుస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా నీటి సంరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించింది.
డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా వంటి సంస్థలు 2030 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. సామాజిక సేవ (సీఎస్ఆర్) కోసం కంపెనీలు సుమారు రూ. ఎనిమిది వేల కోట్లు కేటాయించడంతో 20 కోట్ల మందికి మేలు జరిగిందని రిపోర్టు పేర్కొంది.
