
హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అమరారం అడవుల్లో శిలాయుగం నాటి వందలాది ఆదిమానవుల సమాధులు వెలుగు చూశాయి. చుట్టుపక్కల ప్రజలు రాకాసిగూళ్లుగా పిలిచే ఈ సమాధులను అమరారానికి పదికిలోమీటర్ల దూరంలోని ఓ గుట్టపై కనుగొన్నట్లు తెలంగాణ జాగృతి చరిత్ర బృందం సభ్యులు కొండవీటి గోపి, నాగులపల్లి జగన్ మోహన్ రావు, సింహాద్రి నారాయణ శనివారం వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని స్థానికులు రాకాసిపట్నంగా పిలుస్తారని వారు తెలిపారు. ఈ సమాధులు లోహయుగపు సంస్కృతికి చారిత్రక ఆనవాళ్లుగా నిలుస్తాయని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇవి ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామెరవాయి అడవుల్లో గతంలో వెలుగు చూసిన డోల్మన్ సమాధులను పోలి ఉన్నట్లు తెలిపారు. రాకాసిపట్నం ప్రాంతంలో ఆదిమానవులు కొన్ని ప్రత్యేక విశ్వాసాలతో, సమూహాలుగా జీవనం సాగించి ఉంటారని చరిత్ర బృందం సభ్యులు వెల్లడించారు