128 ఏండ్ల ఆధ్యాత్మిక గురువు, పద్మశ్రీ గ్రహీత స్వామి శివానంద కన్నుమూత

128 ఏండ్ల ఆధ్యాత్మిక గురువు, పద్మశ్రీ గ్రహీత స్వామి శివానంద కన్నుమూత

వారణాసి: పద్మశ్రీ అవార్డు గ్రహీత, 128 ఏండ్ల ఆధ్యాత్మిక గురువు స్వామి శివానంద శివైక్యం చెందారు. ఏప్రిల్ 30 నుంచి వారణాసిలోని BHU హాస్పి్టల్లో శివానందకు చికిత్స అందిస్తున్నారు. శనివారం రాత్రి ఆయన కన్నుమూశారు. ఆయన పరమపదించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాశీ వాసి, ఆధ్యాత్మిక గురువు శివానంద బాబా శివైక్యం చెందిన విషయం తెలిసి చింతించానని, యోగాకు, సాధనకు ఆయన తన జీవితాన్ని ధారబోశారని కొనియాడారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తన ‘ఎక్స్’లో శివానంద బాబా కన్నుమూతపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.

బాబా గత 100 ఏండ్లుగా ప్రతి కుంభమేళాకు హాజరయ్యారు. ప్రయాగ్ రాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్లో జరిగే  ప్రతి కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆయన శిష్యుడు సంజయ్ సర్వజన తెలిపారు. స్వామి శివానంద అత్యంత పేదరికంలో జన్మించారు.

నాలుగేండ్లు వచ్చే వరకు పాలు, పండ్లు, బ్రెడ్ వంటి పదార్థాలను చూడలేదు. దీంతో క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవడింది. ఆయన రాత్రి 9 గంటలకే నిద్రపోయి వేకువజామున 3కే  నిద్ర లేచేవారు. అనంతరం యోగా, ధ్యానం చేస్తారు. మధ్యాహ్నం పూట నిద్ర పోరు. చాలా కాఠిన్యంతో కూడిన జీవనశైలిని అలవాటు చేసుకుని 128 ఏళ్లు జీవించారు.