- ప్రగతి భవన్ ముంగట ఐరన్ గ్రిల్స్
- ఇప్పటికే పోలీసులతో మూడంచెల భద్రత, ఎంట్రీ దగ్గర గ్రిల్స్
- కేసీఆర్ సీఎం అయ్యాకే సెక్యూరిటీ ఏర్పాట్లు
- వైఎస్సార్ టైమ్లో క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్
హైదరాబాద్, వెలుగు: సీఎం క్యాంప్ ఆఫీస్ (ప్రగతి భవన్) దగ్గర రోజురోజుకు సెక్యూరిటీని పెంచుతున్నారు. ఇప్పటికే వందల మంది పోలీసులతో మూడంచెల భద్రత, భవన్ ఎంట్రీ పాయింట్ దగ్గర గ్రిల్స్ ఏర్పాటు చేయగా తాజాగా మరోసారి పెద్ద ఎత్తున ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పంజాగుట్ట-–బేగంపేట రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను తొలగించి అక్కడ గోడను నిర్మించి, వాటి మీద పెద్ద ఎత్తున గ్రిల్స్ సెట్ చేస్తున్నారు. పర్మిషన్ లేకుండా నేతలు, కార్యకర్తలు ప్రగతి భవన్ వైపు వెళ్లలేని పరిస్థితి ఉందని అధికార పార్టీ నేతలే సన్నిహితులతో చెప్తున్నారు.
కేసీఆర్ సీఎం అయ్యాకే సెక్యూరిటీ
వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎం అయ్యాక క్యాంప్ ఆఫీస్ను నిర్మించారు. అక్కడ నిత్యం వివిధ జిల్లాల నుంచి వచ్చే పబ్లిక్ నుంచి వినతి పత్రాలు స్వీకరించి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆ తర్వాత సీఎం రోశయ్య వాస్తు బాలేదని క్యాంప్ ఆఫీస్లో ఉండలేదు. కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లోనే ఉండేవారు. కేసీఆర్ సీఎం అయ్యాక ప్రగతి భవన్ నిర్మించారు. అప్పటి నుంచి దశల వారీగా సెక్యూరిటీని పెంచుతూ వచ్చారు. ఇప్పటికే వందల మంది పోలీసులు అక్కడ సెక్యూరిటీ ఉంటున్నారు. భవన్ ఎంట్రీ పాయింట్ దగ్గర ఇప్పటికే గ్రిల్స్ ఏర్పాటు చేశారు.
ప్రజాసంఘాల ఆగ్రహం
ఇప్పటికే ప్రగతి భవన్ ఎంట్రీ దగ్గర పెద్ద ఎత్తున ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేసి వాటికి సోలార్ కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. ఇటీవల ఎన్ఎస్యూఐ నేతలు గ్రిల్స్ను దాటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడి భద్రత సిబ్బందిపై పోలీసు ఆఫీసర్లు ఫైర్ అయినట్లు తెలిసింది. కాగా, ప్రగతి భవన్ దగ్గర ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేయడంపై పార్టీల, ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు టైమ్ ఇవ్వని, పబ్లిక్ను కలవని సీఎం ఇలా చేయటం బాధాకర మన్నారు. కేసీఆర్ గడీల ఉండి పాలన సాగిస్తున్నారని మండిపడుతున్నారు.