- మళ్లీ గెలిపిస్తే గృహలక్ష్మి కింద ఇండ్లు కట్టిస్తానన్న ఎమ్మెల్యే
- పదేండ్ల సంది కానిది ఇప్పుడెట్లయితదన్న మంచినీళ్ల బండ గ్రామస్తులు
- సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వీడియోలు
హుస్నాబాద్, వెలుగు : ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ను గురువారం జనాలు తమకు పథకాలు అందలేదని నిలదీశారు. అక్కన్నపేట మండలంలో ప్రచారం చేస్తూ మంచినీళ్లబండకు చేరుకోగానే తమకు ప్రభుత్వ స్కీములు అందలేదన్నారు. ఎవరికీ డబుల్బెడ్రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి పథకం, దళితబంధు ఇవ్వలేదని, అన్నీ బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చారని, ఇదేం న్యాయమని ప్రశ్నించారు.
తమ గ్రామంలో బొడ్రాయి పండుగ చేసుకుంటే, రూ.లక్ష సహాయం చేస్తానని మాటిచ్చి తప్పారని మండిపడ్డారు. ఊహించని విధంగా ప్రజల నుంచి నిరసన ఎదురుకావడంతో ఎమ్మెల్యే షాక్కు గురయ్యారు. వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఎమ్మెల్యే వెంట ఉన్న నాయకులు గ్రామస్తులను సముదాయించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రానివారికి గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు కట్టిస్తానని అన్నారు.
మళ్లీ తనకు ఓటు వేసి గెలిపిస్తే అర్హులందరికీ ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. పదేండ్లలో చేయలేనోళ్లు ఇప్పుడు చేస్తారనే నమ్మకమేందని గ్రామస్తులు ప్రశ్నించారు. అయితే, ఈ సంఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు నిమిషాల్లో సోషల్మీడియాలో చక్కర్లుకొట్టాయి. హుస్నాబాద్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైందని వాట్సాప్ గ్రూపుల్లో పలువురు వీడియోలు షేర్ చేశారు. తర్వాత ఎమ్మెల్యే మంచినీళ్లబండ పరిధిలోని యాటకార్లపల్లెతోపాటు టేకులతండా, గొల్లపల్లి, మల్లంపల్లి, మోత్కులపల్లి, పెద్దతండా, చౌటపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.