- ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తున్న నైజీరియన్లు.. సోషల్ మీడియా యాప్స్లో ఆర్డర్స్, కొరియర్లో డెలివరీ
- వివరాలు సేకరించిన ఈగల్ ఫోర్స్
- డ్రగ్స్ కస్టమర్లకు త్వరలోనే నోటీసులు
- కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ కేంద్రంగా నైజీరియన్లు నిర్వహిస్తున్న డ్రగ్స్ నెట్వర్క్ కేసులో ఈగల్ ఫోర్స్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నైజీరియన్ల వద్ద కొకైన్ సహా ఇతర సింథటిక్ డ్రగ్స్ ఆర్డర్లు చేస్తున్న ఏజెంట్లు, కస్టమర్ల వివరాలను సేకరించింది. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసు సహా మరో మూడు కేసుల దర్యాప్తులో ఈగల్ ఫోర్స్ ఢిల్లీలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో కలసి చేసిన సోదాల్లో 50 మంది నైజీరియన్లను అరెస్ట్ చేశారు.
ఇందులో ఐదుగురు ప్రధాన డ్రగ్ సప్లయర్లకు.. హైదరాబాద్ కు చెందిన 1,975 మంది రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్నట్లు గుర్తించారు. రెగ్యులర్గా కొకైన్ ఆర్డర్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. పట్టుబడిన నైజీరియన్ల మొబైల్ ఫోన్స్, కొరియర్ ఆర్డర్లు, డెలివరీ ఆధారంగా కస్టమర్లను ట్రేస్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. డ్రగ్స్ కొనుగోలు చేసే వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
డ్రగ్స్ ఆర్డర్ కోసం ప్రత్యేక యాప్స్, డ్రగ్ కోడ్
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో గుర్తించిన 40 మంది కస్టమర్లు, మహీంద్రా యూనివర్సిటీ స్టూడెంట్స్ డ్రగ్స్ కేసులో ఢిల్లీ డ్రగ్స్ ముఠాల లింకులు లభించాయి. దీంతో పాటు నైజీరియన్లు అందించిన సమాచారం ఆధారంగా ఆర్డర్లు చేసిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యేక యాప్స్ ద్వారా వివిధ రకాల కోడ్ లాంగ్వేజ్తో డ్రగ్స్ ఆర్డర్లు తీసుకునేవారని గుర్తించారు. డ్రగ్స్ డెలివరీ కావాల్సిన కొరియర్ సంస్థలు, లొకేషన్ను కూడా కస్టమర్లు సెలెక్ట్ చేసుకునేవారని సమాచారం.
ఈ క్రమంలోనే లోకల్ ఏజెంట్లు కూడా ఆర్డర్లు తెప్పించుకుని కమీషన్లతో సప్లయ్ చేసేవారని ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో వెలుగు చూసింది. దీంతో పాటు గోవా, ముంబై, కేరళ నుంచి తక్కువ ధరల్లో కొకైన్ కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఢిల్లీ నైజీరియన్ల కస్టమర్లుగా ఉన్న1,975 మంది కస్టమర్లలో అతి తక్కువ మంది వివరాలు మాత్రమే లభించినట్లు సమాచారం.
సింథటిక్ డ్రగ్స్కు కేరాఫ్ అడ్రస్గా నైజీరియన్లు
గంజాయి మినహా కొకైన్, హెరాయిన్, చరస్ సహా ఇతర సింథటిక్ డ్రగ్స్కు నైజీరియన్లు కేరాఫ్ అడ్రస్గా ఉన్నారు. దేశవ్యాప్తంగా డీలర్లు, ఏజెంట్లు, సప్లయర్లతో చైన్ సిస్టమ్తో వారు దందా చేస్తున్నారు. డెడ్డ్రాప్ విధానంతో డెలివరీ చేస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్లతో కొరియర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో డ్రగ్స్ ఏజెంట్లతో సప్లయింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ డెలివరీ చేసేందుకు శ్రీమారుతి కొరియర్స్, డీటీడీసీ, బ్లూ డార్ట్ , ప్రొఫెషనల్, షిప్రాకెట్, ఇండియా పోస్ట్, డెలివెరీ, ట్రాక్ ఆన్ సహా మొత్తం 30కి పైగా కొరియర్ సర్విసెస్ను వినియోగిస్తున్నారు.
కొరియర్ సంస్థలకు ఏమాత్రం అనుమానం రాకుండా డ్రగ్స్ ప్యాకింగ్ చేస్తున్నారు. ప్లిప్ కార్ట్ సహా ఇతర ఈ కామర్స్ సైట్ల ద్వారా కొనుగోలు చేసిన లేడీస్ హీల్స్, షూస్, ఫార్మల్ షర్ట్స్, కాస్మెటిక్స్తో ప్యాక్ చేసి పార్సిల్ చేస్తున్నారు. కాగా, ఢిల్లీలో చిక్కిన ఐదుగురు నైజీరియన్ల వద్ద హైదరాబాద్కు చెందిన సప్లయర్లు, కస్టమర్ల వివరాలతో ఈగల్ ఫోర్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
