సూర్యాపేటలో బాలికపై రేప్..పెట్రోల్ పోసి నిప్పు

సూర్యాపేటలో బాలికపై రేప్..పెట్రోల్ పోసి నిప్పు

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమిస్తున్నానని అమ్మాయి వెంటపడిన ఓ యువకుడు.. అందుకు ఆమె నిరాకరించడంతో ఎవరు లేని టైమ్​లో ఇంట్లోకి చొరబడి రేప్ చేయడమే కాదు.. ఆపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆ అమ్మాయి ప్రస్తుతం చావుబతుకులతో పోరాడుతోంది. ఎస్సై డానియెల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన అమ్మాయి(17) తొర్రూరులోని సమతా పారా మెడికల్ కాలేజీలో చదువుకుంటుంది. ఆమె తల్లిదండ్రులు కూలి పనికోసం హైదరాబాద్ వెళ్లడంతో అమ్మమ్మ దగ్గరే ఉండి చదువు కొనసాగిస్తోంది. అదే గ్రామానికి చెందిన గుగులోత్ వెంకటేశ్​ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అమ్మాయి కాలేజీకి వెళ్లేటప్పుడు వస్తున్నపుడూ ప్రేమించాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. రెండేండ్లుగా ఇదే విధంగా ఆమెను వేధిస్తుండటంతో అందుకు ఆమె అంగీకరించలేదు. అమ్మాయి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు పెద్దమనుషులను ఆశ్రయించగా.. చదువుకుంటున్న అమ్మాయి జోలికి రావడం మంచి పద్ధతి కాదని, మళ్లీ ఇలాంటివి జరగొద్దని వార్నింగ్ ఇచ్చారు.

అంతా ప్లాన్‌‌ ప్రకారమే

తన ప్రేమకు అంగీకరించకపోవడం.. పెద్దల సమక్షంలో వార్నింగ్​ ఇవ్వడంతో అమ్మాయిపై వెంకటేశ్​ కసి పెంచుకున్నాడు. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో ఆమెపై దాడికి ప్లాన్​ వేశాడు. శుక్రవారం రాత్రి బాలిక అమ్మమ్మ లేని సమయం చూసి నేరుగా ఇంట్లోకి చొరబడ్డాడు. అమ్మాయి నోరు బలవంతంగా మూసి ఇంటి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి లాక్కెళ్లాడు. అక్కడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెపై పెట్రోల్​ పోసి అంటించాడు. ఊహించని ఘటనతో ఉలిక్కి పడిన అమ్మాయి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు గుర్తించి మంటలార్పారు. అప్పటికే అమ్మాయి శరీరం సగం వరకూ కాలిపోయింది. వెంటనే 108 అంబులెన్స్​లో ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆమెకు డాక్టర్లు ట్రీట్​మెంట్​ ఇస్తున్నారు. విషయం తెలిసి శనివారం ఊరికి వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్​ ను అరెస్టు చేశామని, పోక్సో చట్టం కింద 40 రోజుల్లోనే అతడికి శిక్ష పడేలా చూస్తామని ఎస్సై డానియల్ చెప్పారు.