
- పోలీసులు కార్డెన్ సెర్చ్నిర్వహించిన కొన్ని గంటల్లోనే చోరీ
- హైదరాబాద్ లో ఘటన
జీడిమెట్ల, వెలుగు: గ్యాస్ కట్టర్తో ఏటీఎం కట్ చేసి, రూ.34 లక్షలు చోరీ చేశారు.. నలుగురు దుండగులు ఈ పని చేసినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయింది. పోలీసులు కార్డెన్సెర్చ్ నిర్వహించిన కొన్ని గంటలకే ఈ సంఘటన జరగడం చర్చనీయాంశమైంది. డీసీపీ సురేశ్కుమార్తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ జీడిమెట్ల మార్కేండేయ నగర్లో బాలానగర్ ఏసీపీ ఆధ్వర్యంలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఐదుగురు ఎస్సైలు, 40 మంది కానిస్టేబుళ్లు మంగళవారం రాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
నంబర్ప్లేట్లేని, చలాన్లు పెండింగ్ఉన్న వాహనాలను సీజ్చేసి, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులను తనిఖీ చేశారు. ఇది జరిగిన కొన్ని గంటలకే(బుధవారం తెల్లవారుజామున 2.45 నుంచి 3.25 గంటల మధ్యలో) స్థానిక హెచ్డీఎఫ్సీ ఏటీఎం వద్దకు రెండు బైక్లపై గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ముసుగు ధరించి, వచ్చారు. లోపలికి వెళ్లి, గ్యాస్కట్టర్తో ఏటీఎంను కట్ చేశారు. అనంతరం క్యాష్డిపాజిట్ ట్రేతో సహా రూ.34 లక్షలను ఎత్తుకెళ్లారు. ముంబయిలో అలారం మోగడంతో అక్కడి అధికారులు 3.27 గంటలకు ఇక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
10 నిమిషాల్లోనే వారు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. డాగ్స్క్వాడ్ ఓ ఇంటి వద్దకు వెళ్లి ఆగిపోయింది. కాగా, చోరీకి ఉపయోగించిన గ్యాస్ కట్టర్, వేసుకున్న దుస్తులు, ఖాళీ క్యాష్ ట్రేను నిందితులు జీడిమెట్ల డిపో వద్ద నాలాలో పడేసి వెళ్లారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులు దొంగతనం చేసినట్లు సీసీ ఫుటేజీ ద్వారా తెలుస్తోందని, కొన్ని క్లూస్ దొరికాయని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీసీ పేర్కొన్నారు.