హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు సీపీ సి.వి.ఆనంద్ వెల్లడించారు. ఇటీవల ట్రాఫిక్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ల (ఎస్ హెచ్వో) తో సమావేశాన్ని ఏర్పాటుచేసి నగరంలోని ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీపై సమీక్షించినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి ఆ మీటింగ్ లో చర్చించినట్లు చెప్పారు. ఫుట్ పాత్ లను ఆక్రమిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ ఎస్ హెచ్వోలకు నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు సీపీ సి.వి.ఆనంద్ ఓ ప్రకటన విడుదల చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ లో..
గ్రేటర్ హైదరాబాద్ లో చాలాచోట్ల అన్నపూర్ణ క్యాంటీన్లు, వాటర్ ఏటీఎంలు, టాయిలెట్లు ఫుట్ పాత్ లపైనే ఏర్పాటు చేస్తున్నారు. సిటీలో 2,500 బస్టాపులు కూడా ఫుట్ పాత్ లపైనే ఉన్నాయి. వీటి పక్కన పాన్ షాపులు, ఇతర చిన్న దుకాణాలున్నాయి. దీంతో జనం ఫుట్ పాత్ లపై దిగి రోడ్లపై నడవాల్సి వస్తోంది. వీటికి తోడు చాలా చోట్ల కరెంటు పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు, కేబుళ్లు కూడా ఫుట్ పాత్లపై ఉంటున్నాయి. రోడ్లు, డ్రైనేజీల రిపేర్ల కోసం తవ్విన మట్టి, నిర్మాణ పనుల వేస్టేజీ, పైపులు వంటి వాటిని ఫుట్ పాత్లపైనే వేస్తున్నారు. గతంలో ఓ సారి స్పెషల్ డ్రైవ్ చేపట్టి 4 వేల ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు.
పర్యవేక్షణ లేకపోవటంతో..
కానీ ఆ తర్వాత పర్యవేక్షణ లేకపోవటంతో మళ్లీ ఫుట్ పాత్ లను కొందరు ఎక్కడికక్కడ ఆక్రమించేశారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 430 కిలోమీటర్ల మేర ఫుట్ పాత్ లు ఉన్నప్పటికీ ఒకటి,రెండు ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల ఒక కి.మీ దూరం కూడా ఫుట్ పాత్ లో నడవలేని పరిస్థితి నెలకొంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో సైతం ఫుట్ పాత్ లు కనిపించడం లేదు. రద్దీగా ఉండే కోఠి, దిల్ సుఖ్ నగర్, సికింద్రాబాద్, అమీర్ పేట్, అబిడ్స్ ప్రాంతాల్లో ఫుట్ పాత్ లు ఉన్నప్పటికీ అవి చిరు వ్యాపారులకే పరిమితమయ్యాయి.