ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

పద్మారావునగర్, వెలుగు: నర్సులకు విదేశాల్లో చాలా డిమాండ్ ఉందని, విదేశీ భాషలను నేర్చుకుంటే అక్కడ ఉద్యోగాలు పొందవచ్చని  డీఎంఈ డాక్టర్ కె. రమేశ్​ రెడ్డి అన్నారు. జపాన్​లో నర్సింగ్ జాబ్​అవకాశాలపై టామ్​కామ్(తెలంగాణ ఓవర్సీస్​మ్యాన్​పవర్ కంపెనీ) ఆధ్వర్యంలో గాంధీ మెడికల్ ​కాలేజీలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా 167 మంది బీఎస్సీ నర్సింగ్ ​పూర్తి చేసిన అభ్యర్థులకు స్క్రీనింగ్​టెస్ట్ ​నిర్వహించగా 90 మంది ఎంపికయ్యారని నిర్వాహకులు తెలిపారు. వారికి 6 నెలల పాటు జపనీస్ ​భాషపై ట్రైనింగ్​ఇచ్చిన తర్వాత ఇంటర్య్వూలు నిర్వహించి, జాబ్స్ ​ఇస్తామన్నారు. కార్యక్రమంలో జపాన్​ ప్రతినిధులు, టామ్​కామ్​ సీఈవో డాక్టర్ విష్ణువర్దన్​రెడ్డి, కాలేజీ వైస్​ ప్రిన్సిపాల్​​ కృష్ణమోహన్, నర్సింగ్ ​విభాగం రిజిస్ట్రార్​ విద్యావతి పాల్గొన్నారు.

స్కాలర్ షిప్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీస్కోవాలె
    ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద స్టూడెంట్ల నిరసన

ఓయూ, వెలుగు: ఎంఫిల్, పీహెచ్​డీ చేసే మైనార్టీ రీసెర్చ్ స్కాలర్లకు మౌలానా ఆజాద్ పేరిట ఇచ్చే స్కాలర్​ షిప్​ రద్దు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్​రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్​కాలేజీ ముందు ఏఐఎస్​ఎఫ్​ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మైనార్టీ స్టూడెంట్లపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఈ స్కాలర్​ షిప్ సాయంతో లక్షలాది మంది మైనారిటీ స్టూడెంట్లు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారని,ప్రభుత్వ నిర్ణయంతో వారు పరిశోధనలకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్​ అన్సారీ, ఏఐఎస్ఎఫ్​ నాయకులు పాల్గొన్నారు.

 

ఎన్ఈపీని ఆపకుంటే మిలిటెంట్ పోరాటాలు
    కొత్త విద్యా విధానంతో పేదలకు నష్టం - ఎస్ఎఫ్ఐ నేత మయూక్ బిశ్వాస్ 

ఓయూ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) అమలును ఆపకపోతే దేశవ్యాప్తంగా మిలిటెంట్ పోరాటాలు తప్పవని ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ హెచ్చరించారు. ఎన్ఈపీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కాదని.. అది నేషనల్ ఎక్స్ క్లూజన్ పాలసీ అని విమర్శించారు. కొత్త విద్యా విధానంతో స్టేట్ బోర్డులు రద్దవుతాయని, దానివల్ల పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల సందర్భంగా ఆయన గురువారం ఓయూలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేద స్టూడెంట్లకు అందించే మిడ్డే మీల్స్ పథకం రద్దు చేస్తూ వస్తున్నారని, మాంసాహారం పేరుతో 14 రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఇవ్వడం ఆపేశారన్నారు. ఉత్తరాఖండ్​లో స్టూడెంట్లకు గుడ్లు వండి పెట్టిన మహిళలను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని తెలిపారు. యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలను రద్దు చేయడం వల్ల సమస్యలపై  ప్రశ్నించే విద్యార్థి నాయకత్వం కరువైందని, భవిష్యత్తులో దేశానికి సమర్థమైన నాయకత్వం ఉండదన్నారు. గుజరాత్ నాయకురాలు సత్యే షా మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో 6 వేల సర్కారు బడులు మూతపడ్డాయని, టీచర్ల కొరత, హాస్టల్స్​లో సౌలతులు లేక స్టూడెంట్లు అవస్థలు పడుతున్నారని చెప్పారు. కాశ్మీర్ ఎస్ఎఫ్ఐ నాయకుడు యూసుఫ్ మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్​లో ఆర్టికల్370 రద్దు తర్వాత నియంతృత్వం పెరిగిందన్నారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ కార్యదర్శి నాగరాజు, కేంద్ర కార్యవర్గ సభ్యుడు బషీర్ పాల్గొన్నారు. 

నర్సరీలను ప్రభుత్వ స్థలాల్లోకి మార్చాలి
    వికారాబాద్ కలెక్టర్ నిఖిల

వికారాబాద్, వెలుగు: జిల్లాలో ప్రైవేటు స్థలాల్లో నిర్వహిస్తున్న అన్ని నర్సరీలను వారం రోజుల్లోగా ప్రభుత్వ స్థలాల్లోకి మార్చాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. హరితహారం నర్సరీలు, రాష్ట్ర క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ పనులు తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో గురువారం కలెక్టరేట్​లోని కాన్ఫరెన్స్ హాల్​లో ఆమె  సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి హరితహారంలో భాగంగా లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యమైన విత్తనాలను నాటి వందశాతం మొక్కలు మొలకెత్తేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, డీఆర్డీవో కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.

పల్లె ప్రకృతి వనాలు భవిష్యత్ దేవాలయాలు

శామీర్​పేట: పల్లె ప్రకృతి వనాలు భవిష్యత్తు దేవాలయాలని మేడ్చల్ జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. గురువారం మేడ్చల్ మండలం మునీరాబాద్ గ్రామంలోని నర్సరీ, పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం  గ్రామ సర్పంచ్​కు సూచనలు చేశారు. మేడ్చల్ ఎంపీపీ  రజిత తదితరులు   పాల్గొన్నారు.