
ముంబై: ‘మహాభారత్’ టీవీ సీరియల్లో కర్ణుడి పాత్రలో నటించి, మెప్పించిన పంకజ్ ధీర్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన బుధవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. పంకజ్ధీర్ వయసు 68 ఏండ్లు. బీఆర్ చోప్రా దర్శకత్వంలో 1988లో వచ్చిన ‘మహాభారత్’ టీవీ సీరియల్అప్పట్లో ఓ సంచలనం. అందులో కీలకమైన కర్ణుడి పాత్రలో పంకజ్ నటించి అందరినీ మెప్పించారు. 1994లో వచ్చిన ‘చంద్రకాంత’ టీవీ సీరియల్లోనూ కీలకమైన శివదత్ రాజు క్యారెక్టర్లోనూ ఈయన నటించారు.
పంజాబ్లో పుట్టిన పంకజ్ ధీర్ 1980లో సినీరంగ ప్రవేశం చేశారు. సినిమాల్లో కన్నా.. మహాభారత్, చంద్రకాంత టీవీ సీరియల్స్ ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టాయి. పంకజ్ తండ్రి సీఎల్ ధీర్ సినీ నిర్మాత, దర్శకుడు. గీత, బహూ బేటీ, జిందగీ వంటి సినిమాలను సీఎల్ ధీర్ తెరకెక్కించారు.
తన సోదరుడు సట్లజ్ ధీర్తో కలిసి ముంబైలో విసాజే స్టూడియోస్ను పంకజ్ ధీర్ ఏర్పాటు చేశారు. 2010లో అభినయ్ యాక్టింగ్ అకాడమీని స్థాపించారు. పంకజ్ ధీర్ భార్య అనితా ధీర్ కాస్ట్యూమ్ డిజైనర్. వీళ్ల కుమారుడు నికితిన్ ధీర్ బాలీవుడ్ నటుడు. కోడలు కృతికా సెంగార్ కూడా నటి. ‘ఝాన్సీ కి రాణి’ టీవీ సీరియల్లో ప్రధాన పాత్రలో కృతిక నటించారు.