
- ఇకపై దరఖాస్తుదారులకుమాత్రమే ఆఫీసుల్లో అనుమతి
- ఈ రూల్స్ కఠినంగా అమలు చేయాలని సీసీపీకి కమిషనర్ ఆదేశాలు
- బిల్డ్ నౌలో దరఖాస్తుదారుల ఫోన్ నంబర్లు మాత్రమే ఉండాలి
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం ప్రక్షాళన మొదలైంది. ఓ పక్కన ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, మరో పక్కన అధికారులపై అవినీతి ఆరోపణలతో కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ విభాగంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కొత్తగా బిల్డ్ నౌ విధానంతో భవన నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతులు జారీ చేస్తున్నది. అయితే బిల్డ్ నౌలో (లైజనింగ్)ఏజెంట్లు, ఆర్కిటెక్సాయంతో భవన నిర్మాణదారులు దరఖాస్తు చేస్తున్నారు.
ఈ దరఖాస్తుల్లో చాలా వరకు ఏదో ఒక విధంగా షాట్ ఫాల్ అవుతున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతుందని కమిషనర్ ఆరా తీయగా, కావాలనే చేస్తున్నారని తెలిసింది. షాట్ ఫాల్ అయిన తర్వాత ఏదో కారణం చెప్పి నిర్మాణదారుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే టౌన్ ప్లానింగ్ విభాగంపై కర్ణన్ నజర్ పెట్టారు.
దరఖాస్తుదారులకే నేరుగా మెసేజ్ లు
జీహెచ్ఎంసీ సర్కిల్, జోనల్ ఆఫీసులతో పాటు హెడ్ ఆఫీస్లోని టౌన్ ప్లానింగ్ విభాగాలకు కేవలం భవన నిర్మాణదారులకు మాత్రమే అనుమతివ్వాలని రెండురోజుల క్రితం ఆదేశించినట్లు తెలిసింది. అలాగే దరఖాస్తుల్లో దరఖాస్తుదారుడి ఫోన్ నంబర్లు మాత్రమే ఉండాలని, ఆర్కిటెక్ట్, ఇతర ఎవ్వరివి ఉండకుండా చూడాలని, దరఖాస్తులకి సంబంధించి మెసేజ్ లు నేరుగా వారికే వెళ్లేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.
ఇకపై టౌన్ ప్లానింగ్ విభాగంలో విజిటర్స్ అంటే కేవలం నిర్మాణదారులే ఉండాలన్నారు. ఈ రూల్స్ ని కఠినంగా అమలు చేయాలని సీసీపీ(సిటీ చీఫ్ ప్లానర్)కి కమిషనర్ ఆదేశించారు. కావాలనే షాట్ ఫాల్ చేసినట్లుగా గుర్తిస్తే సంబంధిత ఆర్కిటెక్ట్ల లైసెన్స్ లు క్యాన్సల్ చేసేందుకు కమిషనర్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
వరుసగా చర్యలు....
టౌన్ ప్లానింగ్ పై గత రెండునెలలుగా కమిషనర్ వరుసగా చర్యలు తీసుకుంటున్నారు. రెండునెలల వ్యవధిలోనే భారీగా బదిలీ చేశారు. ఏండ్లుగా ఒకే దగ్గర తిష్ట వేసిన చౌన్ మెన్ లను బదిలీ చేశారు. అంతకుముందు అసిస్టెంట్ సిటీ ప్లానర్లను బదిలీ చేశారు. ఇప్పుడు ఏజేంట్లు, ఆర్కెటెక్ లపై చర్యలు తీసుకున్నారు. ఇప్పటికి చాలాచోట్ల అధికారులు నేరుగా భవన నిర్మాణదారులు వెళితే పనులు చేయడంలేదు.
బిల్డ్ నౌ లో దరఖాస్తులు చేస్త ఏ ఏదో ఒక సాకు చూపి ఆ ఫైళ్లను అధికారులు షాట్ ఫాల్ చేస్తున్నారు. ఆ తరవాత అదే ఫైల్ ఏజెంట్ల ద్వారా వెళ్తే అప్రూవల్ ఇస్తున్నారు. దీనిపై కూడా కమిషనర్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ తరహాలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు.