హైదరాబాద్, వెలుగు: సినిమా టికెట్ రేట్ల పెంపు వ్యవహారంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఈ వ్యవహారంపై పిటిషన్ ఇంకా సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉందని, అక్కడే తేల్చుకోవాలని తేల్చి చెప్పింది. ‘మన శంకర వరప్రసాద్’ ‘రాజాసాబ్’ కు టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీచేసిన మెమోను సవాల్ చేస్తూ న్యాయవాది చంద్రబాబు వేసిన పిటిషన్లో సింగిల్ జడ్జి టికెట్ ధరల పెంపు మెమోను రద్దు చేశారు.
రేట్ల పెంపుపై 90 రోజుల ముందుగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ షైన్ స్క్రీన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ఎల్పీ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది.
