- 89% మందికి నకిలీల బెడద
- ఫ్యాషన్, ఆటో ప్రొడక్టుల్లో ఎక్కువ
- హైదరాబాద్ మార్కెట్లోనూ అధికం
- ఏఎస్పీఏ–క్రిసిల్ రిపోర్ట్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆహారం వంటి అన్ని రంగాల్లోనూ నకిలీల బెడద పెరుగుతోంది. అథెంటికేషన్ సొల్యూషన్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (ఏఎస్పీఏ)– క్రిసిల్ హైదరాబాద్లో సోమవారం విడుదల చేసి రిపోర్ట్ ప్రకారం.. 89 శాతం మంది తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి నకిలీ ఉత్పత్తిని కొన్నారు.
ఫ్యాషన్, ఎఫ్ఎంసీజీ, ఆటో పార్ట్స్, ఆరోగ్య ఉత్పత్తుల్లో నకిలీల సమస్య తీవ్రంగా ఉంది. 35 శాతం మంది గత 12 నెలల్లో నకిలీ ఉత్పత్తుల బారినపడ్డట్టు తెలిపారు. స్థానిక మార్కెట్లలో లభించే వస్తువులలో 29 శాతం నకిలీవి ఉండవచ్చని అంచనా. ఈ సమస్యపై పెద్ద ఎత్తున అవగాహన కలిగించడం అవసరమని 93 శాతం మంది అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్లో అత్యధికంగా 46 శాతం మంది నకిలీ ఉత్పత్తులను గుర్తించామని వెల్లడించారు. సురక్షితమైన ప్యాకేజింగ్, క్యూఆర్ కోడ్ ఆధారిత వెరిఫికేషన్ వంటి టెక్నాలజీతో నకిలీ ప్రొడక్టులను గుర్తించవచ్చని ఏఎస్పీఏ ప్రెసిడెంట్ అనుజ్ గుప్తా అన్నారు. బ్రాండ్లు, ప్రభుత్వాలు, వినియోగదారులు కలిసి ఈ సమస్యపై పోరాడాలని సూచించారు.
