హైదరాబాద్ ఐటీ కారిడార్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు..ముగ్గురు సప్లయర్లు,16 మంది వినియోగదారులు అరెస్ట్

హైదరాబాద్ ఐటీ కారిడార్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు..ముగ్గురు సప్లయర్లు,16 మంది వినియోగదారులు అరెస్ట్
  • రూ.16 లక్షల విలువైన ఎండీఎంఏ, ఓజీ కుష్​ స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్​లో డ్రగ్స్​ అమ్ముతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్  పెడ్లర్లతో పాటు నగరానికి చెందిన ఓ పెడ్లర్​ను, 16 మంది వినియోగదారులను పోలీసులు అరెస్ట్​ చేశారు. రూ.16.40 లక్షల విలువైన 95 గ్రాముల ఎండీఎంఏ, 50 గ్రాముల ఓజీ కుష్​ డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్​ కమిషనరేట్​లో మీడియాకు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్,​ ఎస్​వోటీ డీసీపీ శోభన్​బాబు వివరాలు వెల్లడించారు. 

ఈ నెల 11న వట్టినాగుపల్లి కింగ్డమ్​ పబ్​ సమీపంలో డ్రగ్స్​ అమ్ముతున్న మూసాపేట్​ జేపీనగర్​కు చెందిన కె. యశ్వంత్​ సాయి షణ్ముఖ్​ను అదుపులోకి తీసుకొని డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టయ్యింది. 2025లో గంజాయి సప్లై చేస్తూ బాలానగర్​ ఎక్సైజ్​ పోలీసులకు చిక్కిన సాయి షణ్ముఖ్​ జైలులో సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి ద్వారా బెంగళూరులో డ్రగ్స్​ సప్లై చేసే మహమ్మద్​ రజెల్, నైజీరియా​కు చెందిన సామ్​ ఫోన్​ నంబర్లు తీసుకున్నాడు. 

జైలు నుంచి బయటకు వచ్చాక వారి వద్ద డ్రగ్స్​ కొని హైదరాబాద్​లో అమ్మడం ప్రారంభించాడు. యశ్వంత్​ ఇచ్చిన సమాచారంతో డ్రగ్స్​ సప్లై చేస్తున్న రజెల్, అతని ప్రియురాలు నవీనను అరెస్ట్​ చేశారు. వీరితో పాటు 16 మంది డ్రగ్స్  వినియోగదారులను అరెస్ట్​ చేసినట్లు డీసీపీ తెలిపారు.​ ఎస్​వోటీ ఏడీసీపీ గోవర్ధన్, గచ్చిబౌలి డీఐ నరేశ్  పాల్గొన్నారు.