
హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో పనుల పై క్లారిటీ ఇచ్చారు మెట్రో రైలు ఎండీ. ఎన్ వీ ఎస్ రెడ్డి. పనులు ఆపాలంటూ హైకోర్టు స్టే ఇచ్చిందంటూ వచ్చిన తప్పుడు కథనాల్లో వాస్తవం లేదన్నారు. పలు న్యూస్ పేపర్, న్యూస్ చానల్ లో వచ్చినట్టుగా ఓల్డ్ సిటీ మెట్రో పనులు, మెట్రో రూట్ లో అస్తుల కూల్చి వేతలపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని స్పష్టం చేశారు. తప్పుదోవ పట్టించేలా వార్తలను ప్రచారం చేశారని చెప్పారు.
అసలేం జరిగిందంటే.?
హైదరాబాద్ మెట్రో రైల్వే ప్రాజెక్ట్ రెండో దశలో భాగంగా వారసత్వ కట్టడాలైన చార్మినార్, ఫలక్నుమా ప్రాంతాల సమీపంలో ఎలాంటి పనులు చేపట్టరాదంటూ హైకోర్టు జూన్ 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని వార్తలు వచ్చాయి. స్టే పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిందని ప్రచారం జరిగింది.
వారసత్వ కట్టడాల పరిరక్షణపై ఎలాంటి అధ్యయనం లేకుండా వాటి సమీపంలో మెట్రో కారిడార్- 6 పనులు చేపట్టడాన్ని సవాలు చేస్తూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (ఏపీడబ్ల్యూఎఫ్) హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకల బెంచ్ జూన్ 12న విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మెట్రో పనుల కారణంగా వారసత్వ కట్టడాలైన చార్మినార్, ఫలక్నుమా సమీపంలోని పలు నిర్మాణాలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. ఈ నిర్మాణాల పటిష్టతపై అధ్యయనానికి నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ వారసత్వ కట్టడాల రక్షణ చట్టం, కేంద్ర పురావస్తు శాఖ చట్ట నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకున్నాకే పనులను కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
►ALSO READ | పూరీ జగన్నాథుడి జెండా ఎత్తుకెళ్లిన గద్ద.. వరస విషాదాలు నాటి హెచ్చరికనా.. విమాన ప్రమాదం దేనికి సంకేతమా..?
ఈ పిటిషన్లో కౌంటరు దాఖలు చేయడానికి 3 వారాల గడువు కావాలని అదనపు ఏజీ కోరడంతో అనుమతించిన ధర్మాసనం.. అప్పటివరకు చార్మినార్, ఫలక్నుమాల సమీపంలో ఎలాంటి పనులను చేపట్టరాదంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో స్పందించిన హైదరాబాద్ మెట్రో..అసలు ఓల్డ్ సిటీ మెట్రో పనులపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఫేక్ వార్తలను నమ్మొద్దని సూచించింది.