
సెప్టెంబర్ 18న గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నగరంలో గణేష్ పండుగ సందర్భంగా అన్ని ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు.. ప్రముఖ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ నిర్మాణ పనులు ఎల్లుండి ( సెప్టెంబర్ 16) వరకు ఖైరతాబాద్ వినాయక విగ్రహం పెయింటింగ్ పనులు పూర్తి అవుతాయి. మరోవైపు నగరంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా భద్రతా చర్యలు, భక్తుల సౌకర్యార్ధం మెట్రో సేవలను కూడా పెంచే అవకాశం ఉంది.
హైదరాబాద్లో గణేష్ ఉత్సవాల సందర్భంగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, ఊరేగింపుల కోసం పోలీసులు దరఖాస్తులను ఆహ్వానించారు. సెప్టెంబర్ 18న ఉదయం 6 గంటల నుంచి బహిరంగ ప్రదేశాల్లో క్రాకర్లు పేల్చడంపై నిషేధం విధించారు హైదరాబాద్ పోలీసులు.తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవులు కేటగిరీ కింద సెప్టెంబర్ 18 న పండుగకు సెలవు ప్రకటించింది.
గణేష్ పండుగ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకోసం ఆఫర్లతో పాటు, అదనపు మెట్రో సేవలను పొడిగించనుంది. ప్రఖ్యాత ఖైరతాబాద్ గణేష్ పండల్ కు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో నిమజ్జనం రోజున మెట్రో సేవలను పొడిగించే అవకాశం ఉంది. గతేడాది మాదిరిగానే అర్థరాత్ర ఒంటి వరకు సేవలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణీకుల కోసం గణేష్ పండుగ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం అదనపు టిక్కెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అదనంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో భద్రత కోసం అదనపు భద్రతా సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు.