ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి లైన్ క్లియర్.. హెచ్ఎండీఏకు 65 ఎకరాల రక్షణ శాఖ భూములు

ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి లైన్ క్లియర్.. హెచ్ఎండీఏకు 65 ఎకరాల రక్షణ శాఖ భూములు
  • హెచ్​ఎండీఏకు 65 ఎకరాల రక్షణ శాఖ భూములు
  • ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం 435 ఎకరాలను ఇవ్వాలని నిర్ణయం
  • హెచ్ఎండీఏ, రక్షణ శాఖల మధ్య కుదిరిన ఎంవోయూ
  • ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్​పల్లి డెయిరీఫామ్ వరకు 5.3 కి.మీ. కారిడార్
  • ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్​పేట వరకూ 18.14 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్​
  • పనులకు త్వరలో ముహూర్తం నిర్ణయించనున్న హెచ్ఎండీఏ

హైదరాబాద్​సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రెండు ఎలివేటెడ్ కారిడార్​ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. ఈ ప్రాజెక్టు కోసం భూములను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా గత మార్చి నెలలో రక్షణ శాఖ గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. భూముల బదలాయింపుపై చర్చల తర్వాత 65.038 ఎకరాలు (2,64,583.47 చ. మీ.) రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి రక్షణ శాఖ అంగీకరించింది. దీనికి రిటర్న్​గా ప్రభుత్వం 435 ఎకరాలు(17,60,384.10 చ. మీ.) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ భూ బదలాయింపులకు సంబంధించి శనివారం రక్షణ శాఖకు చెందిన తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా కమాండెంట్ హెడ్​ఆఫీసులో ఉన్నతాధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం తరఫున హెచ్​ఎండీఏ చీఫ్​ ఇంజనీర్ రవీందర్, రక్షణ శాఖ తరఫున హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్వార్టర్స్ తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా, బ్రిగేడియర్ ఎస్.రాజీవ్, స్టేషన్ కమాండర్ మధ్య సికింద్రబాద్ ప్రాంతంలో రెండు ఎలివేటెడ్ కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్మాణానికి అవసరమైన ఏ–1 రక్షణ భూముల బదిలీ కోసం సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సెక్రటరీ ఇలంబర్తి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫ​రాజ్ అహ్మద్,  బ్రిగేడియర్ కె.సోమశంకర్, ఎస్ఎం(రిటైర్డ్), జీహెచ్​ఎంసీ కమిషనర్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీ కర్ణన్, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా ఇతర సైనిక అధికారులు హాజరయ్యారు. రక్షణ శాఖ ఎలివేటెడ్ కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్మాణానికి 2024, మార్చి1న పర్మిషన్​ఇచ్చింది. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే 44 కింద ప్యార డైజ్ జంక్షన్ నుంచి బోయిన్ పల్లి డైరీఫామ్ రోడ్ వరకు(5.320 కి.మీ.) అలాగే స్టేట్​హైవే 1 కింద ప్యారడైజ్ నుంచి శామీర్ పేట్ వరకు(18.14 కి.మీ.) చేపట్టే ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ ప్రారంభమయినట్టేనని అధికారులు తెలిపారు.

ప్రాజెక్టు స్వరూపం ఇలా..
రాజీవ్ రహదారిలో జింఖానా మైదానం నుంచి హకీంపేట ఎయిర్​పోర్ట్​స్టేషన్, తూంకుంట, శామీర్​పేట మీదుగా ఓఆర్ఆర్ వరకూ ఒక ఎలివేటెడ్​కారిడార్ నిర్మించనున్నారు. అలాగే సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్​పల్లి డెయిరీ ఫామ్​రోడ్ వరకు మరో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్​కారిడార్​ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు మధ్యలో అంటే ఎయిర్​పోర్ట్​కు ఆనుకుని 0.600 కి.మీ. అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మించనున్నారు. మొత్తం రూ.3,812 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. అలాగే ప్రాజెక్టులో భాగంగా ప్రైవేట్ ఆస్తులు కూడా ఈ రెండు చోట్ల సేకరించనున్నారు. సేకరించాల్సిన ప్రైవేట్ ఆస్తుల మార్కింగ్ ఇప్పటికే పూర్తిచేశారు. వారికి నోటీసులు కూడా జారీ చేశారు. వారికి పరిహారం ఇచ్చిన తర్వాత భూసేకరణ చేయనున్నారు.

ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్​పల్లి డెయిరీ ఫామ్​రోడ్ వరకూ 5.320 కి.మీ. మేరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.1580 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 65  ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక ప్యారడైజ్ జంక్షన్ నుంచి హకీంపేట మీదుగా శామీర్​పేట ఓఆర్ఆర్​ను కలిపే ఎలివేటెడ్​కారిడార్​ను రూ.2,232 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 300 ప్రైవేట్​నిర్మాణాలను కూల్చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే డబుల్​డెక్కర్​ కారిడార్​కోసం 200 పైగా నిర్మాణాలను గుర్తించారు. భూసేకరణకు లైన్ క్లియర్​ కావడంతో త్వరలోనే ప్రాజెక్టు నిర్మాణానికి అధికారులు ముహూర్తం నిర్ణయించనున్నట్టు తెలిపారు.