హైదరాబాద్: వైన్స్ షాపులో చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తీరుగుతున్న ముగ్గురు పాత నేరస్థులను పెట్రోలింగ్ పోలీసులు అరెస్టు చేశారు. మీర్ పెట్ పోలీస్ స్టేషన్ ఇన్సెపెక్టర్ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9తేదీన మెహదీపట్నం సమీపంలోని మంద మల్లమ్మ చౌరస్తా వద్ద ఉన్న అమరావతి మద్యం దుకాణంలో ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. చోరి కేసును విచారణ జరిపిన పోలీసులు.. దొంగతనం చేసిన ముగ్గురి వ్యక్తులపై సాంకేతిక నిఘా పెట్టి పట్టుకున్నారు. మంగళవారం గాయత్రి నగర్ ఏస్వి వైన్స్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ ముగ్గురు వ్యక్తులను(రవికుమార్, సాయికుమార్, సాయినాథ్) పెట్రోలింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి రూ.3600 నగదు, బజాజ్ ఆటో, హీరో గ్లామర్ బైక్, స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.1.40 లక్షలు.
ఈ ముగ్గురు వ్యక్తులు పాత నేరస్థులని, గతంలో వీరిపై సరూర్ నగర్, వనస్థలిపురం, సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనట్టు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని సిఐ యాదయ్య తెలిపారు.
