- సోషల్ మీడియాలో కేటీఆర్కు హైదరాబాదీల కంప్లైంట్లు
- ఇండ్లు, కాలనీలు మునిగిన ఫొటోలతో మంత్రికి ట్వీట్లు
- జీహెచ్ఎంసీకి కూడా ఆన్లైన్లో ఫిర్యాదులు
- ఈ ఏడాది ఇప్పటివరకు లక్షా 70 వేల ఫిర్యాదులు
హైదరాబాద్, వెలుగు: వరదలు, నాలాలు పొంగి ఇబ్బంది పడుతున్నామంటూ మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ వేదికగా హైదరాబాదీ జనం ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవలి వానలకు నాలాలు పొంగిన, కాలనీలు నీట మునిగిన ఫొటోలను మంత్రికి షేర్ చేస్తూ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. గతేడాది పరిస్థితి మళ్లీ రాకుండా చూడాలంటున్నారు. కొన్ని రోజులుగా ఇలాంటి సమస్యలపై కేటీఆర్కు ట్వీట్ చేస్తున్న వాళ్లు పెరుగుతున్నారు.
లంగర్ హౌస్ లేక్ దగ్గర నీరు పొంగి పొర్లుతోందని, గతేడాది ఓ మహిళ ఇక్కడే మృతి చెందిందని, దీనిపై ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా జీహెచ్ఎంసీ పట్టించుకోవట్లేదని మహ్మద్ అబ్దుల్ కేటీఆర్కు ఇటీవల ట్వీట్ చేశారు. యాకుత్పురలోని నాలా 2020లో పూర్తిగా నీట మునిగిందని, ఈసారి వానలు పడుతున్నా నాలాలో చెత్తను సరిగా తీయలేదని మహ్మద్ ముజఫర్ మంత్రికి ట్వీట్ చేశారు. అందులోని చెత్తను అలాగే వదిలేస్తే వరదలు వచ్చే ప్రమాదం ఉందని, దీనిపై స్పందించాలని కోరారు. ఇలాంటి సమస్యలపైనే జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్, జోనల్ కమిషనర్లకు కంప్లైంట్లు పెరుగుతున్నాయి. గతేడాది జనం మరణించిన ప్రాంతాల్లోనూ ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని సోషల్ మీడియా వేదికగా జనం ప్రశ్నిస్తున్నారు.
30 వేల కంప్లయింట్స్ పెండింగ్
కరోనా కారణంతో ఫిర్యాదులను జీహెచ్ఎంసీ మాన్యువల్గా తీసుకోవట్లేదు. దీంతో ఆన్లైన్, కాల్ సెంటర్ నెంబర్, ట్విట్టర్ ద్వారా జనం ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలా ఈ ఏడాది ఇప్పటి వరకు లక్షా 70 వేల కంప్లయింట్స్ వస్తే అందులో 30 వేలకు పైగా పెండింగ్లో ఉన్నాయి. ఇందులో హెల్త్, శానిటేషన్కు సంబంధించినవి 10 వేలకు పైగా ఉన్నాయి. జనం నేరుగా వెళ్లి కంప్లయింట్ చేస్తే పట్టించుకోని అధికారులు.. ట్విట్టర్లో మంత్రి, మేయర్కు ట్వీట్ చేస్తే స్పందిస్తున్నారు.
బాగు చేయకపోతేజనం ఊరుకోరు
సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించకపోవడంతో సోషల్ మీడియాలో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రాబ్లమ్స్ పరిష్కరిస్తే ఈ సమస్య ఉండదు. నాలాల విస్తరణ, కొత్త నాలాల నిర్మాణం పనులు చేయకపోవడంతోనే జనం ఈ ఏడాదీ ఇబ్బంది పడుతున్నారు. నాలాల కోసం ఎస్ఎన్డీపీని ఏర్పాటు చేసినా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇకనైనా నాలాలను అభివృద్ధి చేయాలి. లేకపోతే ప్రజలు ఊరుకోరు.
- ఎం. శ్రీనివాస్, సీపీఎం సిటీ కార్యదర్శి