- సింగరేణి విజిలెన్స్ అవేర్నెస్ వీక్లో సజ్జనార్
హైదరాబాద్, వెలుగు: విజిలెన్స్ డిపార్ట్ మెంట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తే అవినీతి, అక్రమాలను నియంత్రించడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. శుక్రవారం సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ అధ్యక్షత జరిగిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అవినీతి, అక్రమాలు తగ్గాలంటే వ్యవస్థల్లో మౌలిక మార్పులు అవసరమని తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వల్ల పారదర్శకత పెరుగుతుందని చెప్పారు.
జీఎస్టీ రంగారెడ్డి కమిషనరేట్ ప్రిన్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగులు జీతం తప్ప మరేమీ ఆశించకుండా తమ ఆలోచనలు మార్చుకుంటే విజిలెన్స్ అవసరం ఉండదని వెల్లడించారు. సీఎండీ ఎన్ బలరామ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల్లో క్రమశిక్షణ, పని గంటల సద్వినియోగం కోసం చొరవ చూపుతున్నామని, వ్యవస్థలను పటిష్టం చేయడానికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
