జంట జలాశయాల్లోకి తగ్గిన వరద ..ఒక్కో గేటు ద్వారా నీటి విడుదల

జంట జలాశయాల్లోకి తగ్గిన వరద ..ఒక్కో గేటు ద్వారా  నీటి విడుదల

హైదరాబాద్​ సిటీ, వెలుగు : జంట జలాశయాల పరీవాక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద తగ్గుముఖం పట్టింది. బుధవారం వరకూ ఉస్మాన్​సాగర్​ఆరుగేట్లను, హిమాయత్​సాగర్​మూడు గేట్లను ఓపెన్​చేసిన అధికారులు గురువారం ఒక్కో గేటు ద్వారానే నీటిని దిగువన మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీ కి 1,450 క్యూసెక్కుల నీటిని అధికారులు  విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం ఉస్మాన్ సాగర్​కు 1,500 క్యూసెక్కుల ఇన్​ ఫ్లో వస్తుండగా, 450 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. అలాగే  హిమాయత్ సాగర్​కు 2,600 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా, వెయ్యి క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల  చేస్తున్నారు. బుధవారం ఒక్కరోజే 6,200 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలినట్టు అధికారులు తెలిపారు.