
హైదరాబాద్ రామంతాపూర్ లో జరిగిన విద్యుత్ షాక్ ఘటనలో మరొకరు చనిపోయారు. ఆగస్టు 17న అర్థరాత్రి శ్రీకృష్ణ రథానికి విద్యుత్ షాక్ తగిలి ఐదుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న గణేష్ ఇవాళ (ఆగస్టు 18న) మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఆరుకి చేరింది. ఇంకా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో కృష్ణ యాదవ్(24), శ్రీకాంత్ రెడ్డి(35), సురేష్ యాదవ్(34), రుద్ర వికాస్(39), రాజేందర్ రెడ్డి(39),గణేష్ లు ఉన్నారు.
అసలేం జరిగిందంటే.?
శ్రీకృష్ణుడి ఊరేగింపు రథానికి ఆగస్టు 17న రాత్రి 12 గంటలకు విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదం జరిగింది. రాత్రి శోభాయాత్ర ముగిసిన తర్వాత రథాన్ని తీసుకెళ్లే జీపు మొరాయించడంతో యువకులు స్వయంగా లాక్కొని వెళ్లారు.. హై టెన్షన్ వైర్ల నుంచి కిందికి ఒక వైర్ వేలాడుతుండడంతో రథానికి తాకి నిప్పు రవ్వలు వచ్చాయి. రథాన్ని పట్టుకున్న వాళ్లంతా ఒక్కసారిగా దూరంగా పడిపోయారు. రథం పట్టుకొని లాక్కెల్తున్న వారికి కరెంట్ షాక్ కొట్టింది. పోలీసులు స్పాట్ కు వచ్చిన తర్వాత వారి వాహనంలో అందరినీ హాస్పిటల్ కి తరలించారు. అయితే హాస్పిటల్ వెళ్లేలోపే ఐదుగురు చనిపోయారని వైద్యులు చెప్పారు. మరి కొందరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
రామంతాపూర్ లో ఉద్రిక్తత
మరో వైపు రామంతాపూర్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లిన విద్యుత్ శాఖ సీఎండి ముషారఫ్ అలీని స్థానికులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేసేంతవరకు ఇక్కడి నుండి వెళ్లొద్దు అంటూ విద్యుత్ శాఖ అధికారులను నిలదీస్తూ నినాదాలు చేస్తున్నారు బస్తీ వాసులు.
►ALSO READ | హైదరాబాద్ శ్రీ కృష్ణుడి రథానికి కరెంట్ షాక్ ఎలా కొట్టింది..