- క్యాంపస్ ఇంటర్వ్యూల్లో బంపర్ ఆఫర్ కొట్టిన తొలి విద్యార్థిని
- మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫీసులో ఉద్యోగం
హైదరాబాద్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధిని ఎన్.దీప్తి క్యాంపస్ ఇంటర్వ్యూలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏడాదికి రూ.2కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికై క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ప్రపంచ స్థాయిలో సత్తా చాటింది. అమెరికాలోని సియాటెల్ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఎంపికైన దీప్తి తండ్రి హైదరాబాద్ పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. క్లూస్ టీమ్ విభాగంలో సైంటిస్ట్ డాక్టర్ వెంకన్న కుమార్తె దీప్తి 2019లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఎంఎస్ (కంప్యూటర్స్) ఈ నెల 2న పూర్తిచేశారు. కోర్సు పూర్తి కాకముందే వర్సిటీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగాయి. గోల్డ్మన్ సాక్స్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు దీప్తికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చినా ఆమె మైక్రోసాఫ్ట్ వైపు మొగ్గుచూపారు. ఇంటర్వ్యూలో దీప్తి ప్రతిభను గుర్తించిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ (ఎస్డీఈ) గ్రేడ్–2 కేటగిరీకి ఎంపిక చేసుకుంటూ రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించారు. తన ప్రతిభకు తగ్గ ఉద్యోగం.. ఆశ్చర్యపోయే రీతిలో మంచి జీతం ఆఫర్ చేయడంతో దీప్తి సంతోషంతో పొంగిపోయింది. ఈ నెల 17న మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో దీప్తి బాధ్యతలు స్వీకరించనున్నారు.
