జేఈఈ అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌లో సౌత్‌‌‌‌జోన్‌‌‌‌ టాపర్‌‌‌‌ మనోడే

జేఈఈ అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌లో సౌత్‌‌‌‌జోన్‌‌‌‌ టాపర్‌‌‌‌ మనోడే
  • ఫలితాలు విడుదల చేసిన ఐఐటీ రూర్కీ
  • ఓపెన్ కేటగిరీలో టాపర్‌‌‌‌గా మహారాష్ర్ట స్టూడెంట్‌‌‌‌ కార్తికేయ
  • టాప్‌‌‌‌ టెన్‌‌‌‌లో ముగ్గురు తెలుగు విద్యార్థులు
  • ఈడబ్ల్ యూఎస్‌‌‌‌ కోటాలోనూ టాపర్‌‌‌‌ మనోడే
  • 1,61,319 మంది పరీక్ష రాస్తే 38,705 మంది క్వాలిఫై
  • తెలుగు రాష్ట్రాల నుంచి 6 వేల మంది అర్హత

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌–2019 రిజల్ట్స్ విడుదలయ్యాయి. రాష్ట్రానికి చెందిన ముగ్గురు విద్యార్థులు టాప్‌‌‌‌ టెన్‌‌‌‌లో చోటు సంపాదించారు. సౌత్ జోన్, ఈడబ్ల్యూఎస్‌‌‌‌ విభాగాల్లో రాష్ట్ర విద్యార్థులు నేషనల్‌‌‌‌ టాపర్లుగా నిలిచారు. స్టూడెంట్ల ర్యాంకులను కేటగిరీలు, జోన్ల వారీగా ఐఐటీ రూర్కీ శుక్రవారం వెల్లడించింది.

38,705 మంది క్వాలిఫై

మే 27న దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ పరీక్షకు మొత్తం 1,61,319 మంది హాజరయ్యారు. ఇందులో 38,705 మంది క్వాలిఫై అయినట్టు ఐఐటీ రూర్కీ ప్రకటించింది. దీంట్లో 1,28,070 మంది బాలురు పరీక్ష రాయగా, 33,349 మంది అర్హత సాధించారు. బాలికలు 33,249 మంది పరీక్ష రాయగా, 5,356 మంది క్వాలిఫై అయ్యారు. ట్రాన్స్‌‌‌‌జెండర్లు ముగ్గురు పరీక్ష రాసినా క్వాలిఫై కాలేదు. తెలుగు రాష్ర్టాల నుంచి 30 వేల మంది పరీక్ష రాయగా, 6 వేల మందికి పైగా అర్హత సాధించినట్టు తెలిసింది. జనరల్‌‌‌‌ కేటగిరీలో 93 మార్కులు, ఓబీసీలకు 84, ఎస్సీ, ఎస్టీలకు 46 మార్కులను కటాఫ్‌‌‌‌గా నిర్ణయించారు.

మెరిసిన తెలుగు తేజాలు

మహారాష్ర్టకు చెందిన కార్తికేయ గుప్తా జేఈఈ అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ టాపర్‌‌‌‌గా నిలిచాడు. 372 మార్కులకు గానూ 346 మార్కులు సాధించాడు. ఢిల్లీకి చెందిన హిమాన్షు గౌరవ్‌‌‌‌ సింగ్‌‌‌‌, ఆర్చిత్‌‌‌‌ బుబ్నా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక రాష్ట్ర విద్యార్థులు 4, 5 ర్యాంకులు, ఏపీ విద్యార్థి 8వ ర్యాంకు సాధించారు. ఓపెన్‌‌‌‌ కేటగిరీలో నాలుగో ర్యాంక్‌‌‌‌ సాధించిన జిల్లెల్ల ఆకాశ్‌‌‌‌రెడ్డి.. సౌత్‌‌‌‌ జోన్‌‌‌‌(ఐఐటీ హైదరాబాద్‌‌‌‌)లో టాపర్‌‌‌‌గా నిలిచాడు. ఓపెన్‌‌‌‌ కేటగిరీలో ఐదో ర్యాంక్‌‌‌‌ సాధించిన బి.కార్తికేయ.. సౌత్‌‌‌‌జోన్‌‌‌‌లో రెండో ర్యాంకు సాధించాడు. ఓపెన్‌‌‌‌లో 8వ ర్యాంకు సాధించిన తివేశ్‌‌‌‌ చంద్ర.. సౌత్‌‌‌‌జోన్‌‌‌‌లో మూడోస్థానంలో నిలిచారు. ఈడబ్ల్యూఎస్‌‌‌‌ విభాగంలో తెలంగాణకు చెందిన చంద్రశేఖర్‌‌‌‌ నేషనల్‌‌‌‌ టాపర్‌‌‌‌గా నిలిచాడు. ఓపెన్‌‌‌‌ కేటగిరీలో 10వ ర్యాంక్‌‌‌‌ సాధించిన మహారాష్ర్టకు చెందిన శబ్నం సహే.. మహిళల విభాగంలో మొదటి ర్యాంకు సాధించింది. సౌత్‌‌‌‌జోన్‌‌‌‌(ఐఐటీ హైదరాబాద్‌‌‌‌) పరిధిలో మొత్తం 8,287 మంది క్వాలిఫై కాగా, టాప్‌‌‌‌ టెన్‌‌‌‌లో ముగ్గురు, టాప్‌‌‌‌ 100లో 30 మంది, టాప్‌‌‌‌ 500 ర్యాంకుల్లో 132 మంది మనోళ్లు ఉన్నారు.

సర్వర్‌‌‌‌ మొరాయింపు

జేఈఈ అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ ఫలితాలను ఉదయం 10 గంటలకే విడుదల చేసినా, వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ సర్వర్‌‌‌‌ ఓవర్‌‌‌‌లోడ్‌‌‌‌ వల్ల ఓపెన్‌‌‌‌ కాలేదు. దీంతో 11.30 గంటల తర్వాతే తమ ఫలితాలను చూసుకోవాలని విద్యార్థులకు ఐఐటీ రూర్కీ సూచించింది. అయితే తర్వాత కూడా ఓపెన్‌‌‌‌ కాలేదు. సాయంత్రం 4 గంటలకు జోసా(జేఓఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ) వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఫలితాలను చూసుకోవాలని మరోసారి ఐఐటీ రూర్కీ ప్రకటించింది.