స్వామి వివేకానంద విగ్రహానికి ఘోర అవమానం

స్వామి వివేకానంద విగ్రహానికి ఘోర అవమానం

హైదరాబాద్ : యువతా లేవండి మేల్కొనండి. గమ్యం చేరేవరకు ఆగొద్దు. అనేటువంటి స్వామి వివేకానంద చెప్పిన ఎన్నో సూక్తులు యూత్ ను కట్టిపడేస్తాయి. యువతకు ఆదర్శంగా నిలిచిన వివేకానంద విగ్రహానికే కొందరు ఆకతాయిలు అవమానించారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ కుంట్లూరులో శుక్రవారం రాత్రి పూటుగా తాగిన దుండగులు.. విచక్షణ మరిచి వివేకానందుడి విగ్రహం చేతిలో మద్యం బాటిళ్లు పెట్టారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం ఆ ముగ్గురు దుండగులను విచారిస్తున్నట్లు సమాచారం. ఆ ముగ్గురు ఎవరు.. ఏ ప్రాంతానికి చెందిన వారు.. జనాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టడానికే ఇలా చేస్తున్నారా.. లేకుంటే మరేమైనా కారణాలున్నాయా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సంఘటనపై విద్యార్థులు, యూత్ మండిపడుతున్నారు. దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానందకు ఇలాంటి అవమానం బాధాకరం అంటున్నారు. తక్షణమే వారికి చట్టపరమైన శిక్షలు వేయాలంటూ సోషల్ మీడియాలో సీరియస్ అవుతున్నారు నెటిజన్లు.