రూ.15 వేలకే వెంటిలేటర్

రూ.15 వేలకే వెంటిలేటర్

లోకల్‌ వస్తువులతోనే రెడీ చేసిన
హైదరాబాద్ యువకుడు
ముంబైకి చెందిన
ఎంట్రప్రెన్యూర్‌తో కలిసి తయారీ
ఫోన్‌లోనే పేషెంట్‌‌ వివరాలు
తెలుసుకునేలా యాప్

హైదరాబాద్, వెలుగు: ఓ హైదరాబాదీ యువకుడు, సిటీలో బిజినెస్‌ చేస్తున్న ముంబై లేడీ ఎంట్రప్రెన్యూర్‌ కలిసి రూ. 15 వేలకే వెంటిలేటర్‌ను తయారు చేశారు. రెండు వారాలు కష్టపడి లోకల్‌గా దొరికే వస్తువులతోనే దీన్నిరూపొందించారు. డాక్ల‌ర్లు కూడా కరోనా బారిన పడుతుండటంతో ప్రతిసారీ పేషెంట్‌ దగ్గరకెళ్లి చెక్‌ చేయనవసరం లేకుండా మొబైల్‌లోనే రిపోర్ట్ చూసేలా యాప్‌ను తీసుకొచ్చారు. ఫోన్‌లోనే ఒకేసారి ఎక్కువ మంది పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేలా రూపొందించారు.

ఖర్చు తక్కువ.. ఫీచర్లెక్కువ

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన సందీప్ గౌడ్‌.. వర్ద‌మాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్, యూఎస్‌లో ఎంఎస్‌ చేసి ఈమధ్యే ఇండియాకు వచ్చారు. కరోనా టైమ్‌లో సొసైటీకి ఉపయోగపడేలా ఏదైనా చేయాలనుకున్నారు. ప్రస్తుత కరోనా టైమ్‌లో వెంటిలేటర్ల అవసరం బాగా పెరిగిందని తెలుసుకున్నారు. వీటినితక్కువ ధరకే తయారు చేయాలని ఆలోచించారు. పంజాగుట్టలో సీనియర్ ఎంట్రప్రెన్యూర్‌గా చేస్తున్న, ముంబైకి చెందిన ఆకాంక్షతో కలిసి రూ.15 వేలలోపు ఖర్చుతోనే వెంటిలేటర్‌ను తయారుచేశారు.

ఖర్చుతక్కువే అయినా ఫీచర్స్ విషయంలో కాంప్రమైజ్‌కాలేదు. యాప్‌లాంటి ఫీచర్‌తో పాటు స్టేజ్‌-1, 2 పేషెంట్లకు వాడేలా వెంటిలేటర్‌ను రెడీ చేశారు. డాక్ట‌ర్ మన్నె గోపిచంద్, డాక్ట‌ర్ కోటిరెడ్డి, ఎయిమ్స్ మాజీ అడ్మినిస్ట్రేట‌ర్ మనీషా, ఐఆర్‌ఎస్ ఆఫీసర్ పి. కృష్ణారావు వంటి నిపుణుల పర్యవేక్షణలో పరీక్షలు చేశారు. లక్ష మంది పేషెంట్లకు అందించాలనే పట్టుదలతో ఆవిష్కరించారు. అడ్వాన్స్డ్ వెర్ష‌న్ త‌యారి కోసం పరిశోధన చేస్తున్నారు.