28 నుంచి ‘వింగ్స్ ఇండియా’ బేగంపేటలో ఎయిర్ షో

28 నుంచి ‘వింగ్స్ ఇండియా’ బేగంపేటలో ఎయిర్ షో

న్యూఢిల్లీ, వెలుగు: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్​ షో  ‘వింగ్స్ ఇండియా –2026’ కు హైదరాబాద్ వేదిక కానుంది. ప్రపంచ విమానయాన భవిష్యత్తును ప్రదర్శించేలా బేగంపేట ఎయిర్ పోర్ట్​లో ఈ నెల 28 నుంచి 31 వరకు ఈ షో జరగనుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ శనివారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ‘భారతీయ విమానయానం’ థీమ్ తో ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు తెలిపింది. డిజైన్ నుంచి విస్తరణ, తయారీ నుంచి నిర్వహణ, చేరిక నుంచి ఆవిష్కరణ, భద్రత నుంచి స్థిరత్వం వరకు ఈ కార్యక్రమం సాగనున్నట్లు వెల్లడించింది. ఈ నాలుగు రోజుల వేడుకలో దేశంలో వేగంగా విస్తరిస్తున్న విమానయాన రంగం, ప్రపంచ వ్యాప్తంగా విజయాలు, తయారీ, సేవలు, ఆవిష్కరణ తదితర అంశాలను హైలెట్ చేయనున్నట్లు పేర్కొంది.

 అంతర్జాతీయ విమానరంగ దిగ్గజ సంస్థలు ఈ వింగ్స్ ఇండియా షోలో పాల్గొనున్నాయి. విమాన ఇంజిన్ తయారీదారులు, ఎంఆర్వోలు, విమానాశ్రయ డెవలపర్లు, ఓఈఎంలు, సాంకేతిక నిపుణులు, శిక్షణ సంస్థలు తరలిరానున్నాయి. ఎయిర్ షో తో పాటు స్టాటిక్ ఎయిర్ క్రాప్ట్ డిస్ ప్లే, ఫ్లయింగ్, ఏరో బాటిక్ షోలు, సీఈఓ రౌండ్ టేబుల్ మీటింగ్స్, బీ2 బీ, బీ2 జీ సమావేశాలు జరగనున్నాయి. ఏవియేషన్ జాబ్ ఫెయిర్, అవార్డుల ప్రదానం, సాంస్కృతిక నృత్యాలు నిర్వహించనున్నారు.