
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్లోని నేషనల్ యునానీ మెడికల్ రీసెర్చ్ సెంటర్కు కేంద్రం రూ.16.05 కోట్లు కేటాయించింది. ఈ నిధితో స్కిన్ డిసీజ్లకు సంబంధించిన ప్రైమరీ రీ సెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆయూష్ శాఖ వెల్లడించింది. యునానీ మెడిసిన్ ఫెసిలిటీస్ను ప్రోత్సహించేందుకు కేంద్ర మైనార్టీ శాఖతో కలిసి ముందుకెళ్తున్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా మైనార్టీ మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం (పీఎంజేవీకే)కింద రూ. 45.34 కోట్లను గ్రాంట్ల రూపంలో అందించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా కేంద్ర ఆయూష్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిధుల్ని హైదరాబాద్, చెన్నై, లక్నో, సిల్చార్, బెంగళూర్లో యునానీ మెడికల్ సిస్టం ప్రమోట్, డెవలప్మెంట్, ఫెసిలిటీస్ అప్ గ్రేడ్ కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది. కాగా, ఈ మొత్తం నిధుల్లో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్(సీసీఆర్ యూఎం)కు రూ.35.52 కోట్లు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ (ఎన్ ఐయూఎం) బెంగళూరుకు రూ.9.81 కోట్లు మంజూరు చేసినట్లు ఆయూష్ శాఖ తెలిపింది.