హైద‌రాబాద్‌లో లాక్‌డౌన్ పెడితే రోజూ 3 గంట‌లు లిక్క‌ర్ సేల్‌కి అనుమ‌తివ్వండి

హైద‌రాబాద్‌లో లాక్‌డౌన్ పెడితే రోజూ 3 గంట‌లు లిక్క‌ర్ సేల్‌కి అనుమ‌తివ్వండి

హైద‌రాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తార‌ని తెలుస్తోంద‌ని, ఒక వేళ మ‌ళ్లీ లాక్ డౌన్ పెడితే నిత్యవ‌స‌రాల్లాగే త‌మ‌కూ ప‌ర్మిష‌న్ ఇవ్వాలంటున్నారు లిక్క‌ర్ అండ్ బీర్ స‌ప్ల‌య‌‌ర్స్ అసోసియేష‌న్, వైన్ షాప్స్ య‌జ‌మానులు. నిత్యావసర వస్తువుల దుకాణాల మాదిరిగానే వైన్స్ షాపులకు కూడా రోజూ మూడు గంటలు పాటు అనుమతి ఇవ్వాల‌ని ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నామ‌న్నారు. అలా అనుమ‌తి ఇవ్వ‌కుంటే తాము తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కరోనాతో ఇప్పటికే సేల్ పడిపోయిందని, బీర్ల అమ్మకాలు సరిగలేవని చెప్పారు. లిక్క‌ర్ అమ్మ‌కాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయ‌న్నారు. లాక్ డౌన్‌లో సుమారు నెల‌న్న‌ర‌కుపైగా వైన్ షాపులు క్లోజ్ చేశామ‌ని, అయిన‌ప్ప‌టికీ ఆ స‌మ‌యంలో ప్ర‌భుత్వం లైసెన్స్ ఫీజును ఏమాత్రం త‌గ్గించ‌లేద‌ని అన్నారు వైన్ షాప్స్ య‌జ‌మానులు. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా తాము తీవ్రంగా న‌ష్ట‌పోయామ‌ని, దీనిని దృష్టిలో ఉంచుకుని, రోజుకు కనీసం మూడు గంటల పాటు అమ్మకాలకు టైమ్ ఇవ్వాల‌ని కోరారు. ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ ఇస్తే సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూ అమ్మ‌కాలు చేస్తామ‌ని చెప్పారు.