
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చేందుకు రడీ అయిందని సమాచారం అందుతోంది. మెట్రో వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం మే నెలలో టికెట్ రేట్లను పెంచే అవకాశం ఉంది. మెట్రో చార్జీలు పెంచే అంశంపై ఇప్పటికే రాష్ట్రప్రభుత్వానికి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ లేఖ రాసింది. హైదరాబాద్ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ చైర్మన్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన భారత్ కు రావడంతోనేఛార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎల్ అండ్ టీ సంస్థ చార్జీల టారిఫ్ తో ఈ ఏడాది రూ. 150 కోట్లు ఆదాయాన్ని పొందాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. ఈ లక్ష్య సాధనలో హైదరాబాద్ లో మెట్రో టికెట్లు పెంచనుంది.
ప్రస్తుతం మెట్రో ట్రైన్ గరిష్ఠ చార్జి రూ. 60 లు కాగా.. దానిని రూ, 75కు పెంచే అవకాశం ఉంది. అలాగే మినిమమ్ టికెట్ రూ. 10 లు. అయితే దీని విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మెట్రో ట్రైన్ లో ఎడ్వర్టైజ్ మెంట్స్.. పలు స్టేషన్లలో షాపింగ్ మాల్స్.. ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఎల్ అండ్ టీ సంస్థ రూ. 1500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. అయితే ఉద్యోగుల జీతాలు.. బ్యాంక్ రుణ వడ్డీలు... ఇతర నిర్వహణ ఖర్చులు ఏడాదికి 2 వేల కోట్ల రూపాయిల వరకు ఉంటుందని.. ఈ క్రమంలో నష్టాల బారి నుండి బయటపడాలంటే చార్జీలు పెంచకతప్పదని హైదరాబాద్ మెట్రో సంస్థ ఎల్ అండ్ టీ అధికారులు తెలిపారు.