- సున్నం చెరువు, తమ్మిడికుంటను పరిశీలించిన హైడ్రా, సీఎంసీ కమిషనర్లు
మాదాపూర్, వెలుగు: నగరంలోని చెరువుల్లోకి వరద నీరు నేరుగా చేరేలా ఇన్లెట్లు, ఫీడర్ చానళ్లను అభివృద్ధి చేస్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, సీఎంసీ కమిషనర్ సృజన వెల్లడించారు. సోమవారం మాదాపూర్లోని సున్నం చెరువు, తమ్మిడికుంట పరిసరాలను క్షేత్రస్థాయిలో వారు పరిశీలించారు. వరద కాలువల అనుసంధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బోరబండ, ఎన్ఆర్ఆర్ పురం, కొండాపూర్ వంటి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు రోడ్లపై నిలవకుండా నేరుగా చెరువుల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అవసరమైతే ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు ద్వారా వరద కాలువలను విస్తరించాలని, మురుగు నీరు కలవకుండా ప్రత్యేక పైపులైన్ల ద్వారా డైవర్ట్ చేయాలని సూచించారు. చెరువుల ఆక్రమణల తొలగింపుతో పాటు, భవిష్యత్తులో వరద సమస్య తలెత్తకుండా ఔట్లెట్ల ద్వారా నీరు సాఫీగా వెళ్లేలా కాలువలను వెడల్పు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యల ద్వారా లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు తప్పుతుందని కమిషనర్లు ధీమా వ్యక్తం చేశారు.
