- ఇప్పటికే ఆరు చెరువులు డెవలప్ చేశాం
- 3 చెరువులను ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం
హైదరాబాద్ సిటీ, వెలుగు : హైడ్రా మొదటి విడత ఆరు చెరువులు అభివృద్ధి చేయగా ఇప్పటికే బతుకమ్మకుంటను ప్రారంభించామని, మరో మూడు చెరువులను ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని హైడ్రా చీఫ్ రంగనాథ్ చెప్పారు. కూకట్ పల్లి నల్ల చెరువు దగ్గర నిర్వహించిన కైట్ఫెస్టివల్లో ఆయన పాల్గొని పిల్లలతో కలిసి పతంగులు ఎగురవేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే డెవలప్చేసిన చెరువులకు తోడు మరో 14 చెరువులు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్దేశించిందని, త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తామన్నారు. నగరంలో 100 చెరువులు అభివృద్ధి జరిగితే చాలావరకు వరదలను నియంత్రించవచ్చన్నారు.
2024లో నిరసనలు...ఇప్పుడు అభినందనలు
2024 సెప్టెంబరులో నల్ల చెరువు విస్తరణ చేపట్టినప్పుడు నిరసనలు ఎదురయ్యాయని, కానీ ఇప్పుడు పండగ వాతావరణం నెలకొందని, అంతా అభినందిస్తున్నారని రంగనాథ్అన్నారు. కబ్జాలతో16 ఎకరాలకు కుచించుకుపోయిన చెరువును 30 ఎకరాలకు విస్తరించామన్నారు. 10 అడుగుల మేర పేరుకుపోయిన పూడికను తొలగించామన్నారు.
ఇక్కడకు 5 కిలోమీటర్ల నుంచి వచ్చి వాకింగ్ చేస్తున్నట్టు చెప్పడం ఆనందాన్నిచ్చిందన్నారు. షటిల్ కోర్టు, కమ్యూనిటీ హాల్, యోగా కేంద్రం, సైకిల్ ట్రాక్, పికిల్ బాల్ ఇలా అనేక క్రీడలు అందుబాటులోకి తెస్తున్నామని, ఇవన్నీ, ప్రజలు ఉచితంగా ఉపయోగించుకునేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
