
- కోహెడలోని వివాదాస్పద భూమిలో తల్వార్లు చూసి షాక్
- మారణాయుధాలతో దాడి చేసినా కేసు పెట్టకపోవడంతో ఆగ్రహం
- ఇలాంటివి చూసే హైడ్రా పీఎస్పెట్టామన్న రంగనాథ్
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: బాధితులు ఫిర్యాదు చేసినా కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని హయత్ నగర్ సీఐ నాగరాజుపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫైరయ్యారు. కోహెడలోని సర్వే నంబర్ 951, 952లో వివాదాస్పద స్థలాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ భూమిలో తల్వార్లు చూసి షాకయ్యారు. స్థలం కొనుగోలుదారులకు, ఫాంహౌస్ ఓనర్కు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తుండగా, ఇటీవల ప్లాటు యజమానులపై మారణాయుధాలతో దాడి చేసినా హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
మీరు కొనుగోలు చేసిన స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే ఆ బాధేంటో తెలుస్తుందని సీఐను మందలించారు. ఈ సందర్భంగా బాధితులకు భరోసా కల్పిస్తూ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల దృష్ట్యానే హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
డాలర్ హిల్స్ కాలనీ పార్కు పరిశీలన
గండిపేట్: మణికొండలోని డాలర్ హిల్స్లో కబ్జాకు గురైన పార్కును రంగనాథ్ పరిశీలించారు. ఫిర్యాదు ఇచ్చిన 15 రోజులకే స్పందించడంపై కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేస్తామని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చారని కాలనీ వాసులు తెలిపారు.