కరోనా క్రైసిస్.. తెలంగాణకు హ్యుందాయ్ మోటార్స్ సాయం

కరోనా క్రైసిస్.. తెలంగాణకు హ్యుందాయ్ మోటార్స్ సాయం

హైదరాబాద్‌: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ తన పెద్ద మనసును చాటుకుంది. కరోనా టైమ్‌లో రోగులకు సాయం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి 100 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 50 బిపాప్‌ మెషీన్లను హ్యుందాయ్‌ మోటార్ ఇండియా ఫౌండేషన్‌ అందించింది. హ్యుందాయ్‌ మోటార్ ఇండియాకు దాతృత్వ విభాగమైన హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఫౌండేషన్‌ (హెచ్‌ఎంఐఎఫ్‌) శనివారం 100 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లతోపాటు 50 బిపాప్‌ మెషీన్లను తెలంగాణ CS సోమేష్‌ కుమార్‌‌, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య(ఐ అండ్ సీ) ఇన్‌ఫర్మేఫన్ టెక్నాలజీ (ఐటీ) శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌లకు అందజేసింది. వీటిని రాష్ట్రంలోని పలు ఆస్పత్రులకు పంపిణీ చేయనున్నారు. ఇదిలాఉంటే..  ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరులో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఫౌండేషన్‌ ఓ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను సైతం ఏర్పాటు చేయబోతోంది. 

హ్యుందాయ్‌ కేర్స్‌ 3.0 కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్‌ బ్యాక్‌ టు లైఫ్‌ ద్వారా అత్యంత క్లిష్టమైన ఆక్సిజన్‌ ఉత్పత్తులను సమకూర్చడంతోపాటు పంపిణీ చేస్తామనే భరోసాను హ్యుందాయ్ సంస్థ అందిస్తోంది. కొవిడ్‌ ఉపశమన కార్యక్రమం కింద అత్యంత కీలకమైన వైద్య యంత్ర సామాగ్రి కొనుగోలు ప్రక్రియను హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఫౌండేషన్‌ వేగవంతం చేసింది. తద్వారా వేగవంతంగా ఉపశమన మెటీరియల్‌ను తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, హరియాణా, న్యూఢిల్లీల్లోని అత్యంత ప్రభావితమైన ప్రాంతాల్లోని ఆస్పత్రులకు అందించాలని యత్నిస్తోంది.