చవకబారు ప్రచారం ఇష్టం లేదు

చవకబారు ప్రచారం ఇష్టం లేదు

రాష్ట్రంలో త్వరలో కొత్తగా కార్గో బస్సులు రానున్నాయి. సీఎం వాటిని ప్రారంభించనున్నారు. అయితే ఆ బస్సులపై కేసీఆర్ ఫొటో  ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారనే వార్తలపై .. తీవ్రంగా స్పందించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల ద్వారా మనం ప్రజలకు దగ్గర కావాలే తప్ప.. చవకబారు ప్రచారాలతో ప్రయోజనం పొందాలనుకోవడం తనకు ఇష్టం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణలో సరకు రవాణా చేసే కార్గో బస్సులపై కేసీఆర్ ఫొటోలు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోందన్న వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మాట్లాడిన ఆయన… బస్సులపై ఫొటోలతో ప్రచారం చేసుకోవాల్సినంత అవసరం తనకు లేదని అన్నారు. ఇలాంటి అంశాలను తాను ప్రోత్సహించబోనని తేల్చిచెప్పారు. మరోవైపు కార్గో బస్సులపై సీఎం ఫొటోలు వద్దంటూ ఆర్టీసీకి సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది.

ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునే పథకాల్లో భాగంగా కొత్తగా కార్గో బస్సులను తీసుకువస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఈ బస్సులను ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు.