హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం.. నేనే చంపించిన.. పోలీసుల ముందు ఒప్పుకున్న సోనమ్ !

హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం.. నేనే చంపించిన.. పోలీసుల ముందు ఒప్పుకున్న సోనమ్ !

షిల్లాంగ్, ఇండోర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజా రఘువంశీని తానే హత్య చేయించినట్లు ఆయన భార్య సోనమ్ రఘువంశీ పోలీస్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. హనీమూన్ కోసమని షిల్లాంగ్ తీసుకెళ్లి కిరాయి హంతకులతో చంపించి, మృతదేహాన్ని లోయలో పడేసినట్లు ఒప్పుకుందని తెలిసింది. ఈమేరకు సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహతో పాటు మిగతా నిందితులను పోలీసులు షిల్లాంగ్ తరలించి విచారించారు.

వారిని కోర్టులో ప్రవేశపెట్టగా.. సోనమ్, రాజ్ కుశ్వాహా, ఆనంద్, ఆకాశ్, విశాల్ సింగ్​లకు న్యాయస్థానం ఈ నెల 19 వరకు పోలీస్ కస్టడీ విధించింది. దీంతో నిందితులతో సీన్ రీకన్ స్ట్రక్చన్ నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, సోనమ్​తో ఇకపై తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం ఉండదని ఆమె సోదరుడు గోవింద్​ చెప్పారు. బుధవారం రాజా రఘువంశీ నివాసానికి వెళ్లిన గోవింద్.. రాజా కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. కన్నీళ్లతో రాజా తల్లికి సారీ చెప్పి ఓదార్చారు. దోషిగా తేలితే సోనమ్​ను ఉరితీయాలని డిమాండ్ చేశారు.

సోనమ్ తొలుత ఫోన్ చేసింది గోవింద్ కే..
మే 23 నుంచి రాజా, సోనమ్​ కనిపించకుండా పోవడంతో ఇరు కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమైంది. జూన్ 2న రాజా మృతదేహం దొరకగా.. సోనమ్​ఆచూకీ లభించలేదు. ఆదివారం అర్ధరాత్రి యూపీలోని ఘాజీపూర్​లో సోనమ్ ప్రత్యక్షమైంది. ఓ దాబా ఓనర్ వద్ద ఫోన్ తీసుకుని సోదరుడు గోవింద్ కు ఫోన్ చేసింది. ఆ సమయంలో సోనమ్ తీవ్ర భయాందోళనతో ఉన్నట్లు మాట్లాడిందని గోవింద్ చెప్పారు. ఆ తర్వాత తానే పోలీసులకు ఫోన్ చేసి చెప్పానని వివరించారు.

పెళ్లికి ముందే తల్లిని హెచ్చరించిన సోనమ్
రాజా రఘువంశీతో పెళ్లి తనకు ఇష్టంలేదని, బలవంతంగా పెళ్లి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని సోనమ్ తన తల్లిని ముందే హెచ్చరించిందని తాజాగా బయటపడింది. రాజా సోదరుడు విపిన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్ కుశ్వాహాతో తన ప్రేమ విషయం సోనమ్ తల్లికి చెప్పింది. సోనమ్ తల్లి వారి ప్రేమకు అడ్డుచెప్పి బలవంతంగా రాజాతో పెళ్లికి ఒప్పించిందన్నారు.